సీఎం అయినా.. సామాన్యుడైనా ఒకటే రూల్: వైఎస్ జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ముఖ్యమంత్రికైనా.. సామాన్యుడికైనా ఒకటే రూల్ ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ప్రారంభమవ్వగానే అక్రమ కట్టడాలు, చంద్రబాబు ఇంటి ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో నిర్వహించిన జీరో అవర్లో అక్రమ కట్టడాల కూల్చివేతపై టీడీపీ సభ్యులు డిమాండు చేయడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం 19.50 మీటర్ల ఎత్తులో ఉందని చెప్పుకొచ్చారు. గతంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే వరద ప్రవహాన్ని అడ్డుకునేలా కట్టడాలు చేపట్టడం సరైంది కాదని బాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుచేస్తే..!
"గ్రీన్ హాల్ను అక్రమంగా కట్టారు.. తొలగిస్తే ప్రశ్నిస్తారా?. చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని తొలగిస్తే చర్చ ఏంటి?. చంద్రబాబు అక్రమ నివాసం పక్కనే ప్రజావేదిక కట్టారు. నది పక్కన ఇళ్లు నిర్మించాలంటే రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
సీఎం హోదాలో ఉండి నిబంధనలు పాటించకపోవడం దారుణం. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే మిగతావారు చేయారా?. సీఎంకు అయినా.. సామాన్యులకైనా నిబంధనలు ఒక్కటే. వరద నీటిని అడ్డుకునేలా ప్రజావేదికను నిర్మించారు. నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అక్రమ కట్టడాలను తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా..?. కరకట్టపై అక్రమ కట్టడాలపై తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రివర్ కన్జర్వేటర్ ఆదేశాలను తుంగలో తొక్కారు. వరద ప్రవాహాన్ని అడ్డుకుంటే విజయవాడ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. అందరికి ఒకే రూల్ ఉండాలి. చంద్రబాబు రూల్స్ పాటించకపోవడంతోనే అక్రమ కట్టడాలు వెలిశాయి. రూల్స్ పాటించకపోవడమేనా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం సామాన్యుడు కడితే వెంటనే కూల్చేస్తారు.. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం. అక్రమ కట్టడాల తొలగింపు ప్రజావేదిక నుంచే ప్రారంభించాం. ఇదొక స్ఫూర్తిగా తీసుకోవాలని, అక్రమ కట్టడాలను తొలగించాలి" అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ముగించారు.
వైఎస్తో వ్యక్తిగత విరోధం లేదు
వైఎస్ జగన్ వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ‘ఇప్పటికే భవనాలు కూల్చాలని ఆదేశాలు ఇచ్చామంటున్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని మనవి చేస్తున్నాను. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దు. రోడ్లపై అక్రమంగా పెట్టిన విగ్రహాలను తొలగించాలి. రోడ్లపై విగ్రహాలు ఉంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. చట్ట వ్యతిరేకంగా కొన్ని వేల రాజశేఖర్రెడ్డి విగ్రహాలు పెట్టారు. ఆయన చట్టాల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్తో రాజకీయ విరోధం తప్ప.. వ్యక్తిగత విరోధం లేదు" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
బాబు వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం!
ఇదిలా ఉంటే ఈ మాటల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రోడ్లపై అక్రమంగా పెట్టిన విగ్రహాలను తొలగించాలని చంద్రబాబు సర్కార్ను కోరారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్చను తప్పుదోవ పట్టించొద్దంటూ చంద్రబాబుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలు సమయాన్ని వృధా చేయొద్దని సభ్యులకు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. సభా సమయాన్ని విపక్షాలు ఉపయోగించుకోవాలని.. సభలో విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఉండదు.. జరగదని స్పీకర్ తమ్మినేని తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.