ఎవరూ తప్పు చేయొద్దు.. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
చట్ట సభల్లో ఎవరూ కూడా తప్పు చేయొద్దని, అవాస్తవాలు చెప్పొద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సభలో మోసాలు, అబద్ధాలు చెప్పే కార్యక్రమం ఉండకూడదని, ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన ఉంచుకోవాలని తెలిపారు. అసెంబ్లీ వ్యవహారాలు, ప్రశ్నోత్తరాలు, బడ్జెట్ నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ షరీఫ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, తదితరులు సభ్యులకు అవగాహన కల్పించారు.
ఎంత గొప్ప స్పీకర్ అయినా సరే..!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేశారు. "రూల్స్ బుక్ను ప్రతి ఒక్కరు చదవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మన పరిస్థితి పెద్దది కదా? మనం చేయ్యి ఎత్తితే స్పీకర్ అనుమతించాలని అనుకుంటాం. సబ్జెట్ మీద ఎంత పట్టు ఉన్నా..మనం చేయ్యి ఎత్తినా స్పీకర్ అనుమతించకపోవచ్చు. ముందుగా ఇచ్చిన లిస్టు ప్రకారమే స్పీకర్ అనుమతిస్తారు. ఆ లిస్టులో పేరు లేకుంటే స్పీకర్ అనుమతించలేరు. దీన్ని తప్పుగా భావించకూడదు. ఇరుపార్టీలు కూడా స్పీకర్కు మాట్లాడే వారు లిస్టు ఇస్తారు. చీఫ్ విప్, విప్లు ఈ లిస్టులు ఇస్తారు. మనం మాట్లాడే అంశంపై ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎంత గొప్ప స్పీకర్ అయినా సరే మాట్లాడే సరికి కొంత భయం ఉంటుంది. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే ప్రిపేర్ కాకపోతే ఫెయిల్ అవుతారు. మనమేదో చెబుతాం. అవతలివారు వెంటనే డాక్యుమెంట్ తీసి ఇదిగో చూడు..తెలియకపోతే తెలుసు..ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. మీ ఇంట్రెస్టుల ప్రకారం మీకు సంబంధం ఉన్న సబ్జెట్పై బాగా ప్రిపేర్ కండి" అని వైఎస్ జగన్ సూచించారు.
నేను తెల్లవారు జామునే ప్రిపేరేషన్!
"కంటెంట్ను పూర్తిగా అవగాహన చేసుకోని టాఫిక్ వచ్చినప్పుడు బాగా మాట్లాడవచ్చు. మనమే ప్రభుత్వం కాబట్టి పూర్తి సమాచారం మన వద్దే ఉంటుంది. గడికోట శ్రీకాంత్ మీకు సమాచారం ఇస్తారు. ప్రిపేర్ కావాలనే తపన మీకు ఉండాలి. ఆ తపన లేకుంటే అసెంబ్లీలో రాణించలేరు. నేను తెల్లవారుజామున 4 గంటలకే సబ్జెట్పై ప్రిపేర్ అయ్యేవారిమి. మెటీరియల్ మొత్తం కూడా చూసుకునేవారం. మనం మాట్లాడిన మాటలు లాజిక్గా మాట్లాడితే ఎంతో సంతోషకరంగా ఉంటుంది" అని కొత్తగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన వారికి జగన్ సూచించారు.
ప్రతిపక్ష హోదా ఉండాలి!
"గతంలో జరిగిన విధంగా కాకుండా.. ఈ సారి అసెంబ్లీలో పరిస్థితిలు ఉండవు. గతంలో మాట్లాడేందుకు మైక్లు కట్ చేసేవారు. మన ప్రభుత్వంలో అలా ఉండదు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వారిలో ఐదుగురిని లాగేసుకుంటే ప్రతిపక్షం కూడా ఉండదు కదా అన్నారు. కానీ నేను వద్దన్నాను.మనకు వాళ్లకు తేడా ఉండాలి కదా? ప్రతిపక్ష అనేది ఉండాలి. మనం ఎవరైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే రాజీనామా చేయించాలి. ప్రజల్లోకి వెళ్లి మనం గెలిపించుకున్న తరువాత మన ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడ గతంలో ఎక్కడా అనర్హత వేటు వేయలేదు. రాజీనామా చేయలేదు. వీటిని భిన్నంగా ఉండాలని మనం మార్గదర్శకంగా ఉండాలి. నేనేతై ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబుకు అవకాశం ఇచ్చాను. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో విందాం. ఆ తరువాత మన ఆర్గ్యూమెంట్ చెబితే ప్రజలు చూస్తారు. ఆ ధైర్యం, నమ్మకం మనకు ఉంటే ఎందుకు భయపడాలి"అని జగన్ చెప్పుకొచ్చారు.
అరగంట ముందు వస్తే మంచిది!
"మనమే ఈ సభకు రాకపోతే ఎందుకు గెలిచామన్నది గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లో వేరే పనులు ఉన్నాయని, వేరే సాకులు చెప్పి చట్టసభకు రాకపోవడం సరికాదు. స్ట్రాటజీ అన్నది ఉండాలంటే అసెంబ్లీ మొదలయ్యే ముందుకు అరగంట ముందు వస్తే బాగుంటుంది. ఏ రకంగా ముందుకు వెళ్దామన్నది చర్చ జరగాలి. పది మందికి ఓ నాయకుడిని నియమిస్తాం. వారు తన పరిధిలోని ఎమ్మెల్యేలను కో–ఆర్డినేట్ చేసే కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీ అయిపోయిన తరువాత మరుసటి రోజు ఏ రకంగా ప్రిపెర్డు కావాలన్నది చర్చించాలి. దానికి సంబంధించిన మెటిరీయల్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఈ సారి అసెంబ్లీని హుందాగా నడుపుతామని, స్పీకర్కు తలనొప్పి లేకుండా పని చేద్దామని, మీ అందరి సహకారంతో గొప్పగా సభను నడిపిస్తానని నమ్మకం ఉంది" అని వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.