'యాత్ర' మూవీ చూసి కంటతడిపెట్టిన వైఎస్ విజయమ్మ
- IndiaGlitz, [Monday,February 11 2019]
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలకమైన 'పాదయాత్ర' నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా మహి వి. రాఘవ తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చిన 'యాత్ర' సక్సెస్ఫుల్గా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వైఎస్ అభిమానులు, సినీ ప్రియులు, పలువురు ప్రముఖులు డైరెక్టర్పై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు 'యాత్ర' చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మహిని మెచ్చుకున్నారు. తాజాగా జగన్ కుటుంబ సభ్యులు ఈ సినిమా తిలకించారు.
అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
సినిమా చూసి బయటికొచ్చిన తర్వాత వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ కంటతడిపెట్టారు. వైఎస్ ఈ లోకాన లేకపోయినా ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టకుండా .. ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ ఈ ‘యాత్ర’ సినిమాను చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారని విజయమ్మ ఒకింత ఆవేదనకు లోనయ్యారు.
మమ్ముట్టి, ఆశ్రిత పాత్రల గురించి..
వైఎస్ సజీవంగా మనముందు లేకపోయినా... ‘యాత్ర’ ద్వారా ఆయనను డైరెక్టర్.. మరోసారి మనముందుకు తీసుకువచ్చారన్నారు. మహి చాలా బాగా సినిమా తెరకెక్కించారని ఆమె కితాబిచ్చారు. వైఎస్ పాత్రలో నటించిన స్టార్ హీరో మమ్ము్ట్టిపై విజయమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా తన పాత్రలో ఆశ్రిత చాలా బాగా నటించిందని విజయమ్మ అభినందించారు. అయితే వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు మమ్ముట్టి, మహి, ఆశ్రితల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.