అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ గుడ్ బై...

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం నాడు గుడ్ బై చెప్పేశారు. కాగా.. యువీ రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఊహాగానాలకు సోమవారంతో ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌ హీరో యువరాజ్‌సింగ్‌ తెరదించేశారు. సోమవారం ఉదయం ముంబైలోని ఓ హోటల్‌లో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించారు. కాగా.. 1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007లో టీ-20 వరల్డ్ కప్, 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా చరిత్ర సృష్టించిన ఘనత యువరాజ్ సింగ్ దక్కుతుంది. ఇదిలా ఉంటే రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఐసీసీ అనుమతి పొంది కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో యువరాజ్‌ ఆడనున్నట్టు సమాచారం. అయితే ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే మరి.

యువీ ట్రాక్ రికార్డ్...

పదిహేడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన యూవీ
ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన అరుదైన రికార్డు అతని సొంతం
యువీ కెరీర్‌లో 40 టెస్ట్‌లు, 304 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్‌లు ఆడిన ఘనత
వన్డేల్లో 8701, టెస్టుల్లో 1900, టీ-20ల్లో 1177 పరుగులు
వన్డేల్లో 14, టెస్టుల్లో 3 సెంచరీలు
మొత్తం తన కెరీర్‌లో వన్డేల్లో 111, టెస్టుల్లో 9, టీ-20లలో 28 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు..
యూవీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2011 వరల్డ్ కప్‌ను భారత్ గెల్చుకుంది
2000, అక్టోబర్ 3న కెన్యాపై తొలి వన్డే అరంగేట్రం
2003లో న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ యూవీ ఆడాడు
2017, జూన్ 30న వెస్టిండీస్‌పై చివరి వన్డే
2012 డిసెంబర్ 9న ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ యువరాజ్ చివరి టెస్టు మ్యాచ్
నా రక్తం ధారపోశా.. ఇక గుడ్ బై!

నా రక్తం ధారపోశా..!

క్రికెట్ కోసం నా రక్తం, స్వేదం ధార పోశాను. ఇన్నేళ్లు నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నాపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్ నాకు ఆడడం, పోరాడటం, పడటం, లేవటం, ముందుకు సాగడం నేర్పింది. ఇకపై కేన్సర్ బాధితులకు అండగా ఉండటమే నా తదుపరి లక్ష్యం అని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, 2011 ప్రపంచ కప్ సమయంలో కేన్సర్ బారిన పడ్డ యూవీ.. ప్రపంచకప్ అనంతరం కేన్సర్ చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కేన్సర్ నుంచి కోలుకున్నాక యువీ ఆటలో వెనకబడిపోయాడని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు.