టీటీడీ 50వ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం
- IndiaGlitz, [Saturday,June 22 2019]
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్.. వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. కాగా ఇప్పటి వరకూ టీటీడీపీ పాలకమండలికి 49 మంది ప్రమాణం చేయగా.. తాజాగా వైవీ 50వ చైర్మన్గా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. శనివారం నాడు వైవీ గరుడఆళ్వార్ సన్నిధిలో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్,వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, రౌతు సూర్యప్రకాశ్ రావు, సినీ నిర్మాత దిల్రాజులు హాజరయ్యారు.
కాగా.. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టం, 1987ను అనుసరించి ఈ నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా... బోర్డులో ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని ఉత్తర్వుల్లో తెలిపారు.
ఎవరీ వైవీ సుబ్బారెడ్డి...!?
ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు. ఒకే ఇంటి ఆడపడుచులను వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాహమాడారు. వైఎస్ మరణం తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో స్థాపించిన వైసీపీలో వైవీ దశాబ్ద కాలంగా క్రియాశీలక బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేశారు. 2014లో ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందిన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పట్లో వైవీ పార్టీకి దూరమవుతారని అందరూ భావించారు. అయితే కష్టకాలంలోనే పార్టీకి అండగా ఉన్నాం.. ఇలాంటి పీక్ టైమ్లో అస్సలు పార్టీ మారే ప్రసక్తే లేదని జగన్కు చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రస్తుతం వైవీ వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. తనకు అన్ని విధాలా అండగా ఉన్న బాబాయ్కు వైఎస్ జగన్ ఊహించినట్లుగానే కీలక పదవే కట్టబెట్టారు.