‘అజిత్’ చనిపోతూ ఆరుగురిని బతికించాడు!
- IndiaGlitz, [Tuesday,May 21 2019]
'అజిత్' అనే యువకుడు చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. మే-15న హైదరాబాద్లో అజిత్కు రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైటెక్ సిటీ వద్ద వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్ రెడ్డి తలకు తీవ్రగాయమైంది. అత్యవసర చికిత్సకై స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి లక్డీకాపూల్లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఎక్కువగా బ్లీడింగ్ కావడంతో బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిర్ధారించారు. దీంతో అవయవదానం కోసం వైద్యులు జీవన్దాన్ ప్రతినిధులతో కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవదానం విశిష్టతను వారికి వివరించగా.. కుటుంబీకులు అందుకు అంగీకరించారు.
ఈ మేరకు జిత్ రెడ్డి శరీరం నుంచి కాలేయం, గుండె, రెండు మూత్రపిండాలు, కార్నియాలు సేకరించారు. అజిత్ రెడ్డి అవయవదానంతో ఆరుగురికి జీవనదానం లభించిందని వైద్యులు కుటుంబ సభ్యులను అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మృత్యు కబళించినా ఆయన అవయవాలు ఆరుగురి జీవితాలను నిలబెట్టాయన్న మాట. అజిత్ మరణించినా ఆ ఆరుగురిలో జీవించే ఉన్నారు. హైటెక్ సిటీలో నివాసం ఉండే మెట్టు అజిత్రెడ్డి అమేజాన్ సంస్థలో పనిచేస్తున్నాడు.