‘షా’కు షాకిచ్చిన బీసీసీఐ.. మరో ఇద్దరికి కూడా!!

భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుగాంచిన ముంబై యువ సంచలనం పృథ్వీ ‘షా’కు బీసీసీఐ సడన్ షాకిచ్చింది. షా అనూహ్యరీతిలో డోప్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో పృథ్వీపై బీసీసీఐ వేటు వేసింది. డోపింగ్ టెస్ట్‌లో భాగంగా అతడు డ్రగ్స్ తీసుకున్నాడని నిర్ధారణ కావడంతో బోర్డు సస్పెన్షన్ విధించడం జరిగింది. 2019 మార్చి 16 నుంచి 2019 నవంబర్ 15 వరకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది.

‘షా’తో పాటు మరో ఇద్దరు కూడా!!

కాగా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న సమయంలో షా యాంటీ డోపింగ్ టెస్ట్‌లో భాగంగా మూత్రనమూనాలను పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఈ పరీక్షలో ట్రబుతలైన్ అనే డ్రగ్ ఉన్నట్లు నిర్ధారణకొచ్చింది. దీంతో యాంటీ డోపింగ్ రూల్ ఉల్లంఘన చట్టం ప్రకారం ఆర్టికల్ 2.1 కింద షా పై బీసీసీఐ సస్పెన్షన్‌ విధించింది. షాతో పాటు మరో ఇద్దరు దేశీయ ఆటగాళ్ళు.. విదర్భకు చెందిన అక్షయ్ దుల్లార్వర్, రాజస్థాన్‌కు చెందిన దివ్య గజరాజ్ కూడా క్రికెట్ బోర్డు యాంటీ డోపింగ్ కోడ్‌ను ఉల్లంఘించారని సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ ఘటనతో తెలిసొచ్చింది!

ఈ వ్యవహారంపై షా మాట్లాడుతూ.. ‘నాకు దగ్గు ఉన్నపుడు సిరప్ తాగాను. ఇదే విషయం బీసీసీఐకు చెప్పినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే బ్యాక్ డేటడ్ సస్పెన్షన్‌ను విధించింది. స్వల్ప అనారోగ్యాలకు కొన్ని సాధారణ ఔషధాలను వాడుతుంటాము. వాటిద్వారా మనకు తెలియకుండానే కొన్ని పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. అలాంటి ఔషధాల పట్ల పరిజ్ఞానం కలిగివుండడం ఎంతో అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ నిషేధం అనంతరం నేను మరింత దృఢవైఖరితో తిరిగొస్తాను అని షా ఓ ప్రకటనలో ఒకింత భావోద్వేగంతో వివరణ ఇచ్చుకున్నాడు.