జనసేన ఎంపీ అభ్యర్థికి చంద్రబాబు బంపరాఫర్!
- IndiaGlitz, [Tuesday,March 26 2019]
టీడీపీకి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ నుంచి బయటికొచ్చేసిన విషయం విదితమే. 2014 ఎన్నికల్లో వైసీపీని కాదనుకొని టీడీపీలో చేరినప్పటికీ తనకు టికెట్ ఇవ్వరా.? అంటూ కన్నెర్రజేసిన ఎస్పీవై ఫ్యామిలీ.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకుంది. జనసేన కండువా కప్పుకున్న కొన్ని నిమిషాలకే అధిష్టానం ఆయనతో పాటు పోటీచేసే కుటుంబీకులకు కూడా బీఫామ్ అందజేసింది. ఎలాగైనా సరే తనను అవమానించిన పార్టీకి సత్తా ఏంటో చూపించాలని గెలుపే లక్ష్యంగా ఎస్పీవై రెడ్డి ముందుకెళ్తున్నారు.
ఫలించని చర్చలు!
అయితే మంగళవారం నాడు చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డితో మంతనాలు జరిపి తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కొందరు నేతలను చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు ఎస్పీవై రెడ్డి ఇంటికెళ్లి చర్చించారు. అయితే రెడ్డి మాత్రం ససేమీరా అన్నారని సమాచారం. దీంతో ఆయన విషయాలన్నీ చంద్రబాబుకు ఆ నేతలు చేరవేశారట.
రంగంలోకి దిగిన బాబు?
ఈసారి ఏకంగా తానే రంగంలోకి దిగిన చంద్రబాబు.. బహిరంగ సభా వేదికగా ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేనకు గుడ్ బై చెప్పి నామినేషన్ వెనక్కి తీసుకుంటే అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. అంతేకాదు టీడీపీ గెలుపుకు సహకరించి అభ్యర్థిని గెలిపించుకుని వస్తే.. మీ కుటుంబానికి ‘ఎమ్మెల్సీ పదవి’ ఇస్తామని సభా వేదికగా చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ను ఎస్పీవై రెడ్డి అంగీకరించి తిరిగి టీడీపీలోకి వెళ్తారా..? లేకుంటే జనసేనలోనే ఉండి తన సత్తా ఏంటో చూపిస్తారో..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.