close
Choose your channels

IPS:సీఎం జగన్‌పై రాయి దాడి ఎఫెక్ట్.. మరో ఇద్దరు ఐపీఎస్‌లపై బదిలీ వేటు..

Wednesday, April 24, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ ఎన్నికల వేళ మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానాలపై బదిలి వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు బుధవారం మధ్యాహ్నం 3గంటల లోపు ఒక్కొక్కరి స్థానంలో ముగ్గరు పేర్లు సూచించాలని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇటీవల విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో ఓ అగంతుకుడు రాయితో దాడి చేయడం తెలిసిందే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మీద రాయితో దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చకు దారతీసింది. ఇది పోలీస్ అధికారుల భద్రతా వైఫల్యమేనని విపక్షాలు ఆరోపించగా.. టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే సీఎం మీద దాడి జరగడాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. విజయవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్న డీజీ సీతారామాంజనేయులపైనా చర్యలు తీసుకుంది.

కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్నారు. కొద్దిరోజుల కిందట కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారంటూ ప్రతిపక్ష నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తేలడంతో వెంకట్రామిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.

అలాగే అంతకుముందు ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఎలక్షన్ కమిషన్ ఇటీవల బదిలీ వేటు వేసిన విషయం విధితమే. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తిరములేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువాలను సస్పెండ్ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో వీరి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. మొత్తానికి పోలింగ్ సమీపిస్తున్న వేళ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.