close
Choose your channels

PM Modi:తొలి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభం.. విద్యార్థులతో కలిసి ప్రయాణించిన ప్రధాని మోదీ

Wednesday, March 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఎస్ ప్లనేడ్ నుంచి హావ్ డా మైదాన్ స్టేషన్ వరకు విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో పలు అంశాలపై సరదాగా చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బంది మోదీకి నదీగర్భం రైలు ప్రయాణ విశేషాలను వివరించారు. మోదీ వెంట బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారికూడా ఉన్నారు. నదీగర్భం గుండా మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నీటి అడుగున మెట్రో రైలు నిర్మించి కోల్‌కతా మరో సరికొత్త రికార్డును సృష్టించింది. కోల్‌కతా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కి.మీల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని కేవలం 45 సెకన్లలోనే దాటనుండటం విశేషం.

దేశంలో తొలిసారి మెట్రో రైలు సేవలు కోల్‌కతాలనే ప్రారంభమయ్యాయి. 1984లోనే కోల్‌కతా నగరంలో మెట్రో పరుగులు పెట్టింది. ఇప్పుడు అండర్ వాటర్ మెట్రోతోనూ చరిత్ర సృష్టించింది. కాగా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడగా.. అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుండగా.. అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. రేపటి నుంచి ఈ సర్వీస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.