close
Choose your channels

KCR:గులాబీ బాస్‌ కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే..

Friday, April 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో తన అనుచరులతో కలిసి తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడు ప్రకాష్ గౌడ్ సైతం వారి బాటలోనే హస్తం కండువా కప్పుకోనున్నారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవ్వడం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల బలం పెంచుకుంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 68 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది.

మరోవైపు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. 'ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి నన్ను అవమానించారు. మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అందుకే అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నాను' అని లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అయ్యే లోపు ఇంకెంత మంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడతారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.