బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలకు జీవీఎల్ వార్నింగ్!
- IndiaGlitz, [Saturday,June 22 2019]
టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్లపై అవినీతి ఆరోపణలు, బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల నగదు తిరిగి చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకుల ఫిర్యాదు మేరకు.. వారి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ, ఈడీ దాడులు సైతం చేసింది. అప్పట్లో ఈ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. అంతేకాదు బీజేపీ కక్షగట్టి మరీ ఇలా చేస్తోందని తెలుగు తమ్ముళ్లు నానా రచ్చకూడా చేశారు. మరికొన్ని రోజుల్లో మరోసారి దాడులు జరిగే అవకాశముందని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు గనుక దాడులు ఇక ఉండని సోషల్ మీడియా వేదికగా.. పలువురు నేతలు సైతం బాహటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎవరైనా ఎదుర్కోవాల్సిందే..!
అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. బీజేపీలో చేరిన నేతలు ఎవరైనా సరే వారిపై అవినీతి ఆరోపణలుంటే తప్పక
అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు. శనివారం నాడు గుంటూరులో మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీలో చేరాలన్న అవినీతి ఆరోపణలున్న నేతలు కాస్త జంకుతున్నారు. అంతేకాదు ఇప్పుడు టీడీపీలో చేరిన ఎంపీలు సైతం ఒకింత జంకుతున్నప్పటికీ.. అవన్నీ మాటలకే పరిమితమవుతాయని అనుకుంటున్నారట.
రైతులకు త్వరలో ఫించన్...
ఐదేళ్ళలో మేం చేసిన అభివృద్ధే మరోసారి అధికారం కట్టబెట్టారు. గత 60 ఏళ్ళ జరగని అభివృద్ధిని మోదీ చేసి చూపించారు.
అందరి అంచనాలకు పటాపంచలు చేస్తూ మోడి అత్యధిక మెజారిటీ సాగించారు.
ఏపిలో గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో నడిచింది.
కేవలం కేంద్రం పై అబండాలు వేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం పని చేసింది. టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి కేవలం మీడియాలోనే ఉంది.
రైతులను ఆదుకునే అంశంపై తొలి క్యాబినెట్లో నిర్ణయం. త్వరలో రైతులకు ఫించన్ అమలులోకి వస్తుంది.
త్వరలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచి నీటిని ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతుంది.
రాజ్యసభలో బలం సరిపడా లేక చాలా బిల్లులు నిలిచిపోయాయి. 2022 నాటికి రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి స్దాయి సంఖ్య బలం వస్తుంది.
చట్టసభలలో అల్లర్లు చేసి, బిల్లులను అడ్డుకున్న పార్టీలు ప్రజా క్షేత్రంలో ఘోరంగా దెబ్బతిన్నాయి.
2024 లో అత్యధిక మెజారిటీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో దక్షణాది రాష్టాలలో అధికారాన్ని చేపడతాం.
వచ్చే నెల 6 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుంది.
6 నెలల నుంచి ఏడాది లోపు ఏపీలో పూర్తి స్దాయి పార్టీ బలం చేకూరుతుంది అని జీవీఎల్ చెప్పుకొచ్చారు.