ఉభయసభల్లో కశ్మీర్ విభజన బిల్లు ఆమోదం
- IndiaGlitz, [Tuesday,August 06 2019]
జమ్మూకశ్మీర్ విభజన బిల్లుపై మంగళవారం నాడు లోక్సభలో ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కాగా.. ఈ బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు.. వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. దీంతో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ పరిగణించబడింది. ఇకపై లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతం కానుంది. ఇదిలా ఉంటే.. సోమవారం నాడు రాజ్యసభలో కశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే. దీంతో ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందినట్లైంది. కాగా ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన అనంతరం.. ఉభయసభలను వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ప్రకటించారు.
యువనేత మద్దతు..!
ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్ విభజన బిల్లును సమర్థించిన కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా మద్దతివ్వడం గమనార్హం. సింథియా వ్యవహారంతో కాంగ్రెస్ కంగుతిన్నది. భారత్లో జమ్మూకశ్మీర్ పూర్తిగా అంతర్భాగమైందని.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని సింథియా వ్యాఖ్యానించారు. అప్పుడు ఎలాంటి అనుమానాలు ఉండేవి కాదని.. దేశ భద్రతకు, సమగ్రతకు సంబంధించిన విషయమని యువనేత చెప్పుకొచ్చారు.
నేను యుగపురుషుడిగా ఉండాలనుకోవట్లే!
అంతకుముందు ఈ బిల్లుపై సుధీర్ఘంగా మాట్లాడిన షా.. ఆర్టికల్ 370 కశ్మీర్ అభివృద్ధికి ఆటంకం కలిగించిందన్నారు. చర్చల పేరుతో 70ఏళ్లు గడిపోయాయని.. కొన్నికొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. జమ్మూకశ్మీర్లో ముస్లింలుసహా అన్నివర్గాల ప్రజలు నివసిస్తున్నారని.. తాను యుగపురుషుడిగా ఉండాలనుకోవడంలేదన్నారు. ఓటు బ్యాంక్ నిర్ణయాలు తీసుకోవడంలేదని.. దేశ క్షేమం కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్టికల్ 370 ఉండగా జమ్మూకశ్మీర్ అభివృద్ధి ఎలా సాధ్యం?.. 370ని ఆసరా చేసుకొని జమ్మూకశ్మీర్ను ఆడుకున్నారని విమర్శలు గుప్పించారు. కొత్త రాష్ట్రం అన్నిరకాలుగా అభివృద్ధి చెందుతుందతని.. సర్పంచ్ స్థాయి నుంచి సీఎం వరకు తమ పాలన సాగిస్తారని ఈ సందర్భంగా షా తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్లో మూడు కుటుంబాలే అధికారాన్ని అనుభవించాయన్నారు. కాగా.. 370 రద్దు వల్ల పరిశ్రమలు వస్తాయి, స్కూళ్లు, ఆస్పత్రులు పెరుగుతాయని ఈ సందర్భంగా అమిత్షా తేల్చిచెప్పారు.