close
Choose your channels

కులాంతర వివాహం చేసుకున్నాడని.. వెంటాడి మరీ హతమార్చారు

Friday, January 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కులాంతర వివాహం చేసుకున్నాడని.. వెంటాడి మరీ హతమార్చారు

పరువు హత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అడుగులు ముందుకు పడుతుంటే.. కులం, మతం విషయంలో మాత్రం వెనక్కి పడుతున్నాయి. దీంతో పరువు హత్యలు సర్వసాధారణమైపోతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రేమ వివాహం ఓ యువకుడి ప్రాణం తీసింది. వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న సదరు యువకుడిని కాపు కాచి.. బైక్‌పై వెంటాడి మరీ దారుణంగా హతమార్చారు. అంతా సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో ఉండగా.. వీరు మాత్రం ఈ దుర్మార్గపు పనికి పూనుకోవడం పట్ల స్థానికులు నిశ్చేష్టులవుతున్నారు.

కర్నూలు జిల్లా నందరవం మండలం గురుజాల గ్రామానికి చెందిన చిన్నలాజర్‌, సువార్తమ్మ దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. వీరిలో ఆడమ్‌ స్మిత్‌ (34) బాగా చదివి ఫిజియోథెరపిస్ట్‌గా పట్టా పొందాడు. అదే గ్రామానికి చెందిన చిన్న ఈరన్న, లక్ష్మి దంపతుల కూతురు మహేశ్వరి డిగ్రీ వరకూ చదివింది. ఒకే గ్రామానికి చెందిన ఆడమ్ స్మిత్, మహేశ్వరి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికి తెలిసింది. దీంతో మహేశ్వరికి ఆమె తల్లిదండ్రులు గత ఏడాది నవంబర్‌లో వివాహం చేయాలని నిశ్చయించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ఈ జంట 2020 నవంబరు 11న నంద్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లింది.

మరుసటి రోజున ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మహేశ్వరి కుటుంబ సభ్యులు ఆడమ్‌పై కక్ష పెంచుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆడమ్, మహేశ్వరి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి రక్షణ కోరారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పోలీసులు రెండు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం పెద్దలకు దూరంగా ఇద్దరూ ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆదోని పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో అడమ్‌ స్మిత్‌ విధులు నిర్వహించేవాడు. ఎప్పటిలాగే గురువారం విధులను ముగించుకుని, మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. దారిలో కాపుగాచిన కొందరు వ్యక్తులు ఆడమ్‌స్మిత్‌ను అడ్డగించారు.

ఏదో జరగబోతోందని గ్రహించిన ఆడమ్.. పరిగెడుతూ తప్పించుకునేందుకు యత్నించాడు. అయినా వెంటాడారు. కొంత దూరం వెళ్లాక ఇక పరిగెత్తేందుకు శక్తి లేక ఆడమ్ కిందపడిపోయాడు. వెంటనే అతని తలపై బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచారు. చుట్టుపక్క వారు అక్కడ గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్నాడని భావించి 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన తండ్రి, పెద్దనాన్నలే ఈ హత్య చేశారని మహేశ్వరి ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.