close
Choose your channels

టీమిండియా జోరుకు కివీస్ బ్రేక్.. రో‘హిట్’ ఉండుంటే...!

Wednesday, February 5, 2020 • తెలుగు Sport News Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హామిల్టన్‌ వేదికగా మూడు వన్డేల సిరీ‌స్‌లో భాగంగా నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ తొలి వన్డే మ్యాచ్‌ జరిగింది. అయితే టీమిండియా కుర్రాళ్లు కష్టపడి పరుగుల వర్షం కురిపించినప్పటికీ ఫలితం లేకుండా పోగా.. కివీస్ ఇరగదీసి కొట్టేసి వన్డేను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకూ వరుస విజయాలన్నీ నమోదు చేసుకున్న ఇండియాను ఓడించడంతో పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. అసలు ఇవాళ మ్యాచ్‌లో ఎవరెలా ఆడారు..? ఎవరు లేని లోటు మ్యాచ్‌లో కొట్టొచ్చినట్లుగా కనపడింది..? ఎవరి వల్ల టీమిండియా ఓడింది..? ప్లస్‌లు మైనస్‌లు ఏంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

టీమిండియా ఆట పరిస్థితి ఇదీ..!

మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్‌.. టీమిండియాకు ఊహించని షాకిచ్చింది. ఆదిలోనే ఇద్దరు ఓపెనర్లుగా దిగిన పృథ్వీ, మయాంక్ అగర్వాల్ పెవిలియన్‌కు పంపించేసింది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని టీమిండియా పరుగుల మోతే మోగించింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన విరాట్ కొహ్లీ.. వచ్చీ రాగానే పరుగుల వర్షం కురిసింది. అయితే అది కంటిన్యూ అయ్యుంటే బాగుండేదేమో.. కేవలం 51 పరుగులకే పరిమితం కావడం.. ఆ తర్వాత క్లీన్ బౌల్డ్ అవ్వడంతో టీమిండియా వీరాభిమానులు నిరాశకు లోనయ్యారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ దుమ్ముదులిపాడు. ఒకానొక సందర్భంలో ఆయన బాదుడుకు కివీస్ ఆటగాళ్లు వామ్మో అని నోరెళ్లబెట్టేశారు కూడా. 101 బంతుల్లో 100 పరుగులు చేసి.. వన్డేల్లో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. అనంతరం షాట్‌కు యత్నించగా క్యాచ్ ఔటయ్యాడు. శ్రేయాస్ ఉన్నంత సేపు.. ఇటు ఈయన.. అటు రాహుల్ ఇద్దరు కుర్రాళ్లు కుమ్మేశారు. వీరి షాట్‌ల థాటికి కచ్చితంగా మ్యాచ్ మనదేనని క్రీడాభిమానులు ఆనందంలో మునిగి తేలారు.. ఈ ఇద్దరు శ్రేయాస్(103), కేఎల్ రాహుల్(88 నాటౌట్) ఉన్నంతవరకూ పరుగులే పరుగులు. అలా మొత్తం నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్.. 347 పరుగులు చేసింది. ఇది భారీ స్కోరే.. కానీ కివీస్ మాత్రం అలవోకగా ఆడేసింది.

కివీస్ ఆట పరిస్థితి ఇదీ!

భారత్ నిర్దేశించిన 348 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడంతో కివీస్ సత్తా ఏంటో టీమిండియాకు తెలిసొచ్చింది. భారీ లక్ష్యం ఉన్నప్పటికీ కివీస్ ఎలాంటి కంగారు లేకుండానే బ్యాటింగ్ చేసేసింది. మార్టిన్ గప్టిల్ (32), హెన్రీ నికోలస్‌ (78)లు అద్భుత ఆరంభాన్నివ్వగా.. ఆ తర్వాత రాస్ టేలర్, కెప్టెన్ టామ్ లాథమ్‌లు దుమ్ము దులిపేశారు. టేలర్ ఫోర్లు, సిక్సర్లలతో పరుగుల మోత మోగించాడు. అలా మొత్తం 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ సెంచరీ (109) చేశాడు. మరోవైపు.. లాథమ్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. అదే దూకుడు చివరి వరకూ కొనసాగించిన కివీస్ చివరికి మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

బౌలింగ్ ఇద్దరు ప్లాప్!?

బ్యాటింగ్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్.. బౌలింగ్ మాత్రం ఏమంతగా రాణించలేదు.. కొహ్లీ క్లీన్ బౌల్డ్ ఒక్కటే తప్ప మిగిలినవన్నీ అంతంతమాత్రమే. మరీ ముఖ్యంగా పరమ చెత్త వైడ్స్ అన్నీ వేసిన కివిస్.. బ్యాటింగ్‌ దాకా వచ్చే సరికి టీమీండియాకు చుక్కలు చూపించింది. ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌కు వచ్చిన కివీస్.. టీమిండియా బౌలర్ల థాటిని తట్టుకుని ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. అటు కివీస్.. ఇటు టీమిండియా ఇద్దరిదీ ఆశించినంతగా బౌలింగ్ లేదని.. ఇది ఇరు జట్లకు పెద్ద మైనస్ పాయింటని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

రో‘హిట్’ లోటు కనిపించిందిగా!

రోహిత్‌కు గాయం అవ్వడంతో మ్యాచ్‌గా దూరంగా ఉన్నాడు. ఆయన స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను రన్నర్‌గా దింపడంతో ఏదో మ్యాజిక్ చేస్తాడని భావించిన క్రీడాభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రోహిత్ ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. ఎవరి నోట చూసినా రోహిత్ మాటే వస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే.. రోహిత్ లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే.. మరోవైపు.. శిఖర్‌ ధవన్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇది టీమిండియాకు మరింత మైనస్ అయ్యింది. రోహిత్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని.. కచ్చితంగా మ్యాచ్ నెగ్గించేవాడని క్రీడాభిమానులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే.. ముందుగా అనుకున్నట్లుగానే వరుస పరాజయాలకు కివీస్‌ బ్రేక్‌ వేసేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.