close
Choose your channels

ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

Saturday, December 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూడు నెలల సుదీర్ఘ విరామానంతరం ఎట్టేకేలకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో వెంటనే అప్రమత్తమైన సీఎం కేసీఆర్.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా.. స్లాట్ బుకింగ్స్ మాత్రం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్లాట్ల బుకింగ్‌కు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ‘నాన్‌-అగ్రికల్చర్‌’ ఆప్షన్‌ ఓపెన్‌ కాలేదు.

ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ల బుకింగ్‌ జరగనున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివారి విషయంలో కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేయవచ్చన్నారు. పెండింగ్‌ మ్యూటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్‌లో వార్‌ రూం ఏర్పాటు చేసినట్లు సోమేశ్ కుమార్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే ఈ-పాస్‌బుక్‌ ఇస్తామన్నారు.

కాగా.. 4143 మంది డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయగా.. గత రాత్రి 7 గంటల వరకు రాష్ట్రమంతా కలిపి కేవలం 37 స్లాట్లు బుక్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం నుంచి మీ సేవ నుంచి కూడా స్లాట్లు బుక్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. రూ.200 చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. బల్క్‌ రిజిస్ట్రేషన్ల కోసం కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 451 మంది బిల్డర్లు 93,874 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేశారు. కాగా.. లే-అవుట్‌ అప్రూవల్స్‌ లేని భూముల్లో విక్రయించిన ఓపెన్‌ ప్లాట్ల కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను అమల్లోకి తెచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.