పెళ్లి పత్రిక చూసి షాక్ అయిన ప్రధాని మోదీ!
Send us your feedback to audioarticles@vaarta.com
కాల క్రమేణా జనాలు వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాము చేసే పనిలో కొత్తదనం ఉండాలని.. తామెవ్వరి ట్రెండ్ను ఫాలో అవ్వమని ట్రెండ్ సెట్ చేస్తామంటూ టెక్నాలజీని వాడుకుంటూ జనాల నోళ్లలో మెదులుతున్నారు. ఇదిగో ఈ పెళ్లిపత్రికను చూడండి.. జనాలు ఏ రేంజ్కు ఎదిగిపోయారో మీకే తెలుస్తుంది. ఈ వెడ్డింగ్ కార్డ్ను చూసినోళ్లంతా వామ్మో.. ఇలా కూడా వాడొచ్చా అని ముక్కున వేలేసుకుంటున్నారట.
గుజరాత్ దంపతుల కిరాక్ ప్లాన్..!
గుజరాత్కి చెందిన యువరాజ్ పోఖర్నా, సాక్షి అగర్వాల్ అనే ఇద్దరూ వినూత్నంగా పెళ్లి కార్డు ముద్రించారు. అందరి మాదిరిగా కార్డ్ ఉంటే కిక్ ఏముంటుంది.. కాస్త క్రియేటివిటీగా ఉంటే కిరాక్ అనిపిస్తుందనుకున్నారేమో గానీ ఇలా వెరైటీగా ఆలోచించారు. పెళ్లి పత్రికలో ముహూర్తం.. వధువు, వరుడు వివరాలతో పాటు చివర్లో ‘రాఫెల్ ఒప్పందం గురించి కొన్ని వాస్తవాలు..’ ముద్రించారు. దీంతో ఈ కార్డు చూసినోళ్లంతా అందరికీ గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గుర్తొచ్చింది. కాగా సదరు జంటకు సూరత్లో జనవరి 22న వివాహం జరిగింది.
పెళ్లి కార్డుకు రిటర్న్గా మోదీ లేఖ..!
ఇలా వినూత్నంగా ముద్రించిన కార్డు మోదీ కంట పడటంతో ఒకింత షాకై.. సూపర్బ్ అంటూ మెచ్చుకుని సదరు జంటపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు స్వయంగా ప్రధానే ఆ నవ దంపతుల కుటుంబానికి లేఖ కూడా రాశారు. "మీ శుభలేఖలోని విషయం చాలా ‘తెలివిగా’ ఉంది. నవదంపతులిద్దరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్డు చూసిన తర్వాత దేశం కోసం మరింత కష్టపడి పనిచేసేలా నాకు స్ఫూర్తినిచ్చింది. నూతన దంపతులకు భగవంతుడు సంతోషకరమైన, సౌభాగ్యవంతమైన జీవితం ప్రసాదించాలి" అని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ తన లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ లేఖ అందినట్లు నవదంపతుల కుటుంబీకులు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
నవ దంపతులు వినూత్నంగా పెళ్లి పత్రిక ప్లాన్ చేయడం.. దాన్ని మోదీ మెచ్చుకోవడంతో అటు పార్టీ శ్రేణులు.. ఇటు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వెడ్డింగ్ కార్డును షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు వ్యవహారం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.