నిజాన్ని ఎవరూ ఆపలేరు: రామ్ గోపాల్ వర్మ
- IndiaGlitz, [Sunday,May 26 2019]
రామ్గోపాల్, ఆగస్త్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా మే 31న ఆంధ్రప్రదేశ్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన ప్రెస్మీట్లో..
రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ - ''నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చేయడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య నటుడు, మోస్ట్ పాపులర్ మ్యాన్ స్వర్గీయ ఎన్టీఆర్గారి జీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందో చెప్పడానికే. ఎలక్షన్ కోడ్ కావచ్చు.. ఏదైనా కావచ్చు. కానీ తెలంగాణలో విడుదల చేయడానికి లేని అభ్యంతరం ఇక్కడ మాత్రం ఎందుకు?. సినిమాను రిలీజ్ చేయనీయకుండా రకరకాల అడ్డంకులు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రెస్మీట్ పెట్టడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి బలవంతంగా హైదరాబాద్ పంపేశారు.
నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ అవుతుంది అని పోలీస్ శాఖ అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ విజయవాడలో అడుగు పెట్టనీయకుండా చిన్న కాల్తో మమ్మల్ని అరెస్ట్ చేశారు. చిన్న ఫోన్ కాల్తో అది జరిగింది. అదెవరు చేశారో మీకు తెలుసు. నిజాన్ని ఎవరూ ఆపలేరు. ఆలస్యం కావచ్చునేమో కానీ ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడుతుంది. ఆ టైం ఈవాళ వచ్చింది. ఈ నెల 31న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కానుంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో మెయిన్ సన్నివేశాలు దాదాపు పాతికేళ్ల క్రితం జరిగినవి. కానీ అందులో పాల్గొన్న పాత్రధారులు ఇప్పటికీ రాజకీయాల్లో, ప్రజల్లో ఉన్నారు. కానీ ఏ వ్యక్తి ఫోటో పెట్టుకుని మీరు ఓట్లు అడుక్కుంటున్నారో, ఆ వ్యక్తిని మీరే ఏం చేశారు? అనే నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించడమే నేను చేసిన పెద్ద తప్పు.
అయితే ఎన్టీఆర్గారు ఆ వ్యక్తిని నమ్మి నాకంటే పెద్ద తప్పు చేశారు. కానీ ఫైనల్గా ఈ సినిమా రాకముందే ప్రజల నుండి ఆ వ్యక్తికి శిక్షపడింది. సినిమా విషయంలో నేను ఎక్కడా కాంట్రవర్సీ చేయలేదు. జరిగింది సినిమాగా తీశాను. చంద్రబాబునాయుడుగారు కాంట్రవర్సీ చేశారే కానీ.. నేను కాదు. 70 సంవత్సరాలు చక్రవర్తిలా బ్రతికిన ఓ వ్యక్తి చివరి రోజుల్లో నరకయాతన పడి చనిపోయారు. అలా ఎందుకు జరిగిందనేది సినిమాగా చూపించాలనుకున్నాను. పాతికేళ్ల తర్వాత కూడా అదే వ్యక్తి ఫోటోను పట్టుకుని ప్రజల ముందుకు వెళుతున్నారు. దాని కన్నా వెన్నుపోటు చరిత్రలోనే లేదనేది నా ఉద్దేశం. నా నెక్ట్స్ సినిమా 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'. నాకు ఐడియా ఇప్పుడే వచ్చింది. కథ రాయడం మొదలు పెడతాను. చంద్రబాబు ఓటమికి ఆయన వెన్నుపోటు, అబద్ధాలు, హామీలు నేరవేర్చకపోవడం, వై.ఎస్.జగన్, లోకేష్ అని నేను అనుకుంటున్నాను'' అన్నారు.
నిర్మాత రాకేష్ మాట్లాడుతూ - ''ఈరోజు నిజాన్ని చూపించడానికి ఎంత కష్టమైందో మీరు చూడొచ్చు. నిజాన్ని కొన్నిరోజులు ఆపొచ్చు. కానీ ఎప్పుడైనా చూపించే దమ్మున్న దర్శకుడు ఆర్.జి.విగారు లక్ష్మీస్ ఎన్టీఆర్ చేశారు. మార్చి 25న సినిమాను అంతటా విడుదల చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనకు చంద్రగ్రహణం పట్టింది. ఈరోజు చంద్రగ్రహణం వీడింది. 31న నిర్భయంగా చూపించే నిజాన్ని తెలుగు ప్రజలు చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాం'' అన్నారు.