మంత్రి కేటీఆర్ ని కలిసిన సోనూసూద్.. ఆ ఇద్దరు దర్శకులు కూడా..

సోనూసూద్ దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్నాడు. బడా సెలెబ్రిటీలు కూడా సోనూసూద్ అభిమానులుగా మారిపోతున్నారు. కరోనా విపత్కర సమయంలో అభినవ కర్ణుడిగా సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలే అందుకు కారణం. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు చేర్చడం మొదలు కొన్ని ఎన్నో సేవాకార్యక్రమాలను సోనూసూద్ నిర్వహిస్తున్నారు. 

ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం, ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, తన సొంత ఖర్చులతో పేదవారికి వైద్యం చేయించడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలని సోనూసూద్ నిర్వహించారు. అభిమానులకు ఆరాధ్యుడిలా మారారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తాజాగా సోనూసూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ని హైదరాబాద్ లో కలుసుకున్నారు. సోనూసూద్, కేటీఆర్ మధ్య ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. సోనూసూద్ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలని కేటీఆర్ అభినందించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం సోనూసూద్ పనిచేస్తున్న విధానం గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. 

ఇంత భారీ స్థాయిలో సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్పవిషయం అని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం ఆశాజ్యోతిగా మారారని సోనూసూద్ ని అభినందించారు. తన తల్లి ఆదర్శంతోనే తాను ఈ సేవ చేస్తున్నట్లు సోనూసూద్ కేటీఆర్ కు తెలిపారు. కేటీఆర్ అంటే తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని అన్నారు. 

ఈ సందర్భంగా సోనూసూద్ ని కేటీఆర్ సత్కరించి మొమెంటో అందించారు. ఈ మీటింగ్ లో సోనూసూద్ తో పాటు టాలీవుడ్ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూడా పాల్గొన్నారు.