ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు జనసేనాని సెల్యూట్
Send us your feedback to audioarticles@vaarta.com
జమ్ముకశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదేనని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో మొదట 36మంది అని చెప్పిన ఆర్మీ వర్గాలు మరికొందరు అత్యవసర చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించాయి. ఈ వార్త విన్న ప్రతీ భారతీయుడి రక్తం ఉడుకుతోంది. జవాన్లపై దాడి బాధాకరమని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సెల్యూట్ చేశారు.
జనసేనాని మాటల్లోనే..
"జమ్ము కాశ్మీర్ లోని పుల్వామాలో భద్రత బలగాలపై ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడి హేయమైనది. ఈ దాడిలో 36 మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలచివేసింది. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నాయి. అమరవీరులకు నా తరఫున, జనసైనికుల తరఫున సెల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరువదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. దేశం యావత్తు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలి. క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. శత్రువులు మన వైపు కన్నెత్తి చూడకుండా చేయడంతోపాటు జవాన్లలో ఆత్మ స్థైర్యం నింపాల్సిన తక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది" అని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. జవాన్లకు సెల్యూట్ చేసిన జనసేనానిపై పలువురు నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రముఖులు, రాజకీయ ఉద్ధండులు స్పందించకపోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.