close
Choose your channels

ఈ ఒక్క విషయంలో జగన్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..!?

Thursday, June 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఒక్క విషయంలో జగన్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..!?

గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ మంచిగా మెలుగుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లపాటు పరిష్కారం కాని సమస్యలు.. వైఎస్ జగన్ సీఎం అయిన ఐదు రోజుల్లోనే పరిష్కారమయ్యాయి. ఇది కేవలం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న మైత్రి బంధం వల్లేనని సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇందుకు ఉదాహరణ నీటి వాటా, భవనాల పంపకాలతో పాటు పలు విషయాన్ని కేసీఆర్ సానుకూలంగానే స్పందించారు. అయితే.. భద్రాద్రి రాములోరిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేస్తారా..? త్వరలోనే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అవుతుందా..? అనేదానిపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ‘భద్రాచలం బదిలీ’ ఎంత వరకు సాధ్యమో ఇప్పుడు చూద్దాం.

గతంలో ఏం జరిగింది..!?

ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న ‘పోలవరం’ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకమునుపే ఆ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీకి బదలాయించాలన్న డిమాండ్ మేరకు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీకి బదిలీ అయిపోయిన విషయం విదితమే. అయితే భద్రాచలానికి కూడా పోలవరం ముంపు ప్రమాదం ఉందన్న విషయాన్ని కేసీఆర్ అప్పట్లో ఒప్పుకోలేదు.. కచ్చితంగా భద్రాచాలం తెలంగాణలో ఉండాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి మరీ గులాబీ బాస్ రాష్ట్రంలోనే కలుపుకున్నారు.

ఎక్కడ తేడా కొట్టింది..!?

భద్రాచలం రాములోరి ఆలయంలో గతంలో జరిగిన పూజా విధానాలకు ఇప్పుడు జరుగుతోన్న పూజా విధానాలకు చాలా తేడా ఉందట. దీంతో ఆలయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. మరోవైపు రామాలయ భూములు ఎక్కువగా ఏపీ పరిధిలో ఉండటంతో ఏపీలోని భద్రాచలాన్ని కలిపేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. భద్రాచలం పట్టణాన్ని తిరిగి ఆంధ్రాలో కలిపేలా చర్యలు తీసుకోవాలని కొందరు ఆలయ పెద్దలు త్వరలోనే జగన్‌ను కలిసి ఈ విషయంపై చర్చించబోతున్నారు.

కేసీఆర్‌ను అడిగితే పరిస్థితేంటి..!?

ఒకవేళ భద్రాచలం మాకిచ్చేయండి సారూ.. అని కేసీఆర్‌ను అడిగితే పరిస్థితేంటి..? అసలు కేసీఆర్ ఈ వినతికి అంగీకరిస్తారా..? ఏపీ జనాల వినతిని మన్నిస్తారా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ విషయంలో పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఏదడిగినా కేసీఆర్ కాదనకుండా కచ్చితంగా ఇచ్చేస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం కచ్చితంగా కేసీఆర్ నో చెప్పేస్తారని చెబుతున్నారు. అయితే తెలంగాణలోని భవనాలను మొత్తం వాళ్లకే అప్పజెప్పేయడంతో కచ్చితంగా భద్రాచలం విషయంలో కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని తెలుస్తోంది.

కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే..!

ఇదిలా ఉంటే.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రెండు రాష్ట్రాల శాసన సభలు తీర్మానించాల్సి ఉంది. అనంతరం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అయితే కేంద్రం మాత్రం భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 1959కి పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఉంది. కాగా 2014లో భద్రాచలం ఒక్క ఊరు తప్ప మిగతా మండలాలన్నీ ఏపీలో విలీనమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ బదిలీ వ్యవహారంపై అసలు జగన్-కేసీఆర్ మధ్య చర్చ జరుగుతుందా..? లేకుంటే అయిపోయిన పెళ్లికి మేళాలేంటి..? అని మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.