close
Choose your channels

Sirivennela Seetarama Sastry:మాట నిలబెట్టుకున్న జగన్.. సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో 500 గజాల స్థలం కేటాయింపు, అక్కడే ఎందుకు..?

Sunday, March 26, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. విశాఖలోని వుడా లే ఔట్‌లో సిరివెన్నెల కుటుంబానికి 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాంటి ఇలాంటి చోట కాకుండా పరిపాలనా రాజధానిగా విశాఖను నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వంలోని కీలక అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ లే ఔట్‌లో సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయించడం విశేషం. విశాఖలోనే సీతారామశాస్త్రి కుటుంబానికి స్థలాన్ని ఎందుకు కేటాయించారనే డౌట్ మీకు రావొచ్చు. దీనికి కూడా కారణం లేకపోలేపదు.

అనకాపల్లి ప్రాంతంతో సిరివెన్నెలకు అనుబంధం:

అనకాపల్లి జిల్లాలోనే సిరివెన్నెల పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ఆ ప్రాంతంలో యోగా మాష్టారుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగంలోకి ప్రవేశించడంతో సిరివెన్నెల హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే ఆయన బంధువులు, సోదరులంతా విశాఖ ప్రాంతంలోనే వున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం సీతారామశాస్త్రి కుటుంబానికి ఇదే ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. అంతేకాదు.. సిరివెన్నెల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆయనకు సంబంధించిన ఖర్చులన్నీ ఏపీ ప్రభుత్వమే భరించింది. సీతారామశాస్త్రి మరణానంతరం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని జగన్ అప్పట్లోనే ప్రకటించారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ రోజు జీవో జారీ చేసింది. 2021 నవంబర్ 30న కోట్లాది మంది సంగీత ప్రియులను ఒంటరిని చేసి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు సీతారామశాస్త్రి.

విద్యాభ్యాసం ఈ ప్రాంతంలోనే :

సిరివెన్నెల పూర్తి పేరు చెంబోలు సీతారామశాస్త్రి . 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సిరివెన్నెల జన్మించారు. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివిన ఆయన... కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమండ్రిలో కొన్నాళ్లు పనిచేశారు. అయితే అన్నలో వున్న ప్రతిభను గుర్తించిన సిరివెన్నెల తమ్ముడు.. బాగా ప్రోత్సహించారట.

కే . విశ్వనాథ్ నుంచి పిలుపు:

ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలి పాటను రాశారు. విధాత తలపున’ పాటతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు తన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రి ది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు .. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

సిరివెన్నెల పాట లేకుంటే వీళ్లు సినిమా తీయరు:

రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు. దర్శకుడు కె.విశ్వనాధ్‌తో సిరివెన్నెల నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ పాట రాశారు సీతారామశాస్త్రి. ఆయనపై అభిమానంతో కె.విశ్వనాథ్ ప్రేమగా సీతారాముడు అని పిలిచేవారట. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు స్వయంగా బంధువు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రే. ఇక నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగరాయ్‌లో చివరిగా రెండు పాట‌లు రాశారు సిరివెన్నెల. ఈ క్రమంలోనే ఆయన న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరి.. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.