close
Choose your channels

హైదరాబాద్‌లోని ఏపీ భవనాలన్నీ తెలంగాణ సర్కార్‌కే!

Monday, June 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌లోని ఏపీ భవనాలన్నీ తెలంగాణ సర్కార్‌కే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం రాజధాని చాలా వరకు పంపకాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు.. పోలీసు భవనం, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు పలు భవనాలు పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. అయితే గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుకు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు మధ్య కొన్ని అనివార్యకారణాలు గ్యాప్ వచ్చింది. దీంతో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి పరిపాలన చేయడానికి వీలున్నప్పటికీ చంద్రబాబు మాత్రం కరకట్టకు చేరుకుని అక్కడ్నుంచే పరిపాలన సాగించారు.

భవనాలన్నీ తెలంగాణకే..!

అయితే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన పంపకాలు.. ఇచ్చుపుచ్చుకోవడాలపై దృష్టి సారించారు. దీంతో ఇద్దరు సీఎంలు ఇటీవల ఇప్తార్ విందులో గవర్నర్‌తో భవనాల విషయమై చర్చించారు. మరోవైపు తెలంగాణ మంత్రులు సైతం గవర్నర్‌కు ఈ విషయం వీలైనంత త్వరగా తేల్చాలని కోరారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరిసగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి నడుస్తున్నందున హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లిస్తోంది. మరోవైపు నిరుపయోగంగా ఉండటంతో భవనాలు పాడవుతున్నాయి.

పంపకాలు పూర్తయినట్లేనా..!?

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ కేబినెట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

కాగా.. తెలంగాణ ప్రభుత్వమే మొత్తం అన్ని భవనాలను తీసుకొని ఏపీకి మాత్రం ఏ మాత్రం అందుకు సరిపడ్డ నగదు వగైరా ఇవ్వకపోవడంతో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఇలా చేస్తున్నారేంటి..? ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు జగన్‌కు సూచిస్తున్నారు. ఉత్తర్వులు అయితే గవర్నర్ జారీ చేశారు గానీ.. ఈ వ్యవహారంపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.