close
Choose your channels

CM Jagan:సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు..

Friday, November 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అలాగే రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

రఘురామ పిటిషన్‌లోని అంశాలు..

పదేళ్లుగా నెమ్మదిగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని.. విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

రఘురామ పిటిషన్‌పై ధర్మాసనం పలు ప్రశ్నలు..

అయితే రఘురామ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రఘురామ ఫిర్యాదుదారు.. బాధితుడు కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని ప్రశ్నించింది. ఫిర్యాదుదారు కానప్పటికీ పిటీషన్ దాఖలు చేయవచ్చని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీ కదా అని అడగగా.. ఆయన అధికార వైసీపీకి చెందిన ఎంపీనే అని ధర్మాసనానికి తెలియజేశారు. మొత్తానికి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు జోక్యంతో జగన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.