రాజమండ్రిలో 'ఇండియన్ 2'
- IndiaGlitz, [Wednesday,September 18 2019]
లంచగొండి అధికారుల భరతం పట్టిన సేనాపతి వెండితెరపై సందడి చేసి 23 ఏళ్లు అవుతుంది. 'ఇండియన్(భారతీయుడు)'గా 1996లో వెండితెరపై సేనాపతి చేసిన సందడి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్, స్టార్ డైరక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్గా 'ఇండియన్ 2' రూపొందుతోంది.
కొన్ని రోజులుగా చిత్రీకరణ దశలోనే ఈ సినిమా కొంత మేర షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు శంకర్, కమల్ హాసన్ అండ్ టీమ్ తదుపరి షెడ్యూల్ను రాజమండ్రిలో ప్లాన్ చేశారు. రాజమండ్రి జైలులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి శంకర్ ప్లాన్ చేశాడు. గురువారం నుండి ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతుంది. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
'2.0' తర్వాత శంకర్, కమల్ హాసన్తో కలిసి 'ఇండియన్ 2'ను ప్రారంభించారు. కానీ.. క్రమంగా బడ్జెట్ విషయంలో శంకర్, లైకా ప్రొడక్షన్స్కు మధ్య కాస్త బేదాభిప్రాయాలు రావడంతో ప్రాజెక్ట్ ఓ దశలో ఆగిపోయింది. చివరకు పలు దఫాల చర్చలు తర్వాత ఇండియన్ 2 ప్రాజెక్ట్ సెట్స్పైకి వచ్చింది. అయితే శంకర్కు లైకా బడ్జెట్ పరిమితులు విధించినట్లు సమాచారం. సినిమాను కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేయడానికి శంకర్ ప్లాన్స్ చేస్తున్నారట.