కాకినాడ ఎంపీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన జనసేనాని
- IndiaGlitz, [Saturday,February 16 2019]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగదలచిన ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియ గత మూడ్రోజులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దశమి మంచి రోజు కావడంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు బరిలోకి దిగే ఆశావహుల సంఖ్య వందల సంఖ్యలో ఉండటంతో పార్టీ కార్యాలయం ఉదయం నుంచే కిటకిటలాడింది. స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి దరఖాస్తుని సునిశితంగా పరిశీలిస్తూ, పార్టీ అధినేత పవన్కళ్యాణ్ సూచనలకి అనుగుణంగా పని చేస్తోంది.
కాకినాడ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..!
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి, అధ్యక్షులు పవన్కు విధేయుడుగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసిన వ్యక్తి మారిశెట్టి. రాఘవయ్య గారు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ బాటలోనే రాఘవయ్య స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించారు. సీనియర్ లీడర్, నలుగురికి కలుపుకుపోయే మనసత్వం ఉన్న రాఘవయ్య ఇప్పటికే పార్టీ గుర్తు, పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాలను తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇటీవల ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు యువత, మహిళలు బ్రహ్మరథం పట్టిన విషయం విధితమే. అలాంటి రాఘవయ్య కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీకి దిగితే మాత్రం మిగిలిన రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి చూస్తే దాదాపు కాకినాడ ఎంపీ అభ్యర్థి ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. కాగా ఇప్పటికే తెనాలి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ను ఇదివరకే జనసేనాని ప్రకటించారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు సక్సెస్ అవుతారు..? ఎవరు ఫెయిల్ అవుతారు..? అనే విషయం తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే మరి.