close
Choose your channels

హెలికాఫ్టర్ ప్రమాదం: సాయితేజ మృతదేహం గుర్తింపులో జాప్యం.. ఆధారమైన ‘‘పచ్చబొట్టు’’

Saturday, December 11, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది సైనిక సిబ్బంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా వున్నారు. అయితే మూడు రోజులు కావొస్తున్నా ఆయన భౌతికకాయం స్వగ్రామానికి చేరలేదు. ప్రమాదంలో గుర్తు పట్టలేని విధంగా వున్న మృతదేహాలకు అధికారులు డీఎన్ఏ టెస్టుల ఆధారంగా వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. అయితే సాయితేజ విషయంలో మాత్రం ఇందులో జాప్యం జరిగింది.

‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ఆయన ఇచ్చిన శిక్షణతో సైనికులుగా ఎంపికైనవారు, బంధువులు, స్నేహితులు, ప్రజలు ఇలా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లె పరిసర ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గరువారం రాత్రి ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు, కుమారుడి నుంచి సేకరించిన రక్త నమూనాలను సైనిక సిబ్బంది ఢిల్లీ తీసుకెళ్లారు. అయితే సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తులు మృతదేహం గుర్తింపులో ఎంతో సాయం చేశాయి. సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉంటాయని సైనిక అధికారులకు ఆయన తండ్రి తెలియజేశారు. వీటి ఆధారంతో మృతదేహం గుర్తింపు సులభమైంది. అనంతరం సాయితేజ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.