close
Choose your channels

1 నుంచి విద్యార్థుల ఇళ్లలో మోగనున్న బడి గంటలు..

Tuesday, August 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆన్‌లైన్ తరగతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లకు విద్యార్థులను రప్పించే పరిస్థితి అయితే లేదు. దీంతో పాఠశాలలో మోగే బడి గంటలు ఈ సారి విద్యార్థుల ఇళ్లలోనే మోగనున్నాయి. ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసుల దిశగా అడుగులు వేస్తోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అందించే డిజిటల్ పాఠాలను దూరదర్శన్ యాదగిరి ఛానల్, టీశాట్ ఛానళ్ల ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్ట్ 5న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

అయితే ఆగస్ట్ 10న విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ పాఠాలు మొదలవుతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా సగం మంది ఉపాధ్యాయులు ఈ నెల 17 నుంచే విధులకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలను తెరవడంతో పాటు, సాధారణ తరగతుల విషయమై ఆలోచన చేస్తామని చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ విధులకు హాజరవ్వాలని సూచించారు. ఈ కంటెంట్‌తో పాటు పాఠ్య ప్రణాళికను సైతం సిద్ధం చేయాలని ఆదేశించారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావలంటీర్లకు మాత్రం ఎలాంటి సూచనలూ చేయలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమవగానే వారిని రెన్యువల్ చేస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 12600 మంది విద్యావలంటీర్లు ఉండగా.. పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్లర్లు 2800 మంది ఉన్నారు. కాగా శాశ్వత ఉపాధ్యాయులు మాత్రం సుమారు 1.15 లక్షల మంది ఉన్నారు. మొత్తానికి సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయి. మరి ఇవి ఎంత మేరకు సత్ఫలితాన్నిస్తాయనే దానిని పక్కనబెడితే.. విద్యార్థులకు విద్యా సంవత్సరం మాత్రం మిస్ అవకుండా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంద.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.