close
Choose your channels

Pawan Kalyan Chandrababu: చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ కీలక భేటీ.. బీజేపీతో పొత్తుపై చర్చలు..

Wednesday, March 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్.. ఎన్డీఏలో టీడీపీ చేరికతో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశమయ్యే అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. అలాగే రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపైనా చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి జాబితాలో టీడీపీ 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా..జనసేన కేవలం ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది.

మిగిలిన 19 సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటన అక్కడ ఎదురవ్వబోయే ఇబ్బందులు వంటివి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేనకు ఇవ్వాల్సిన 19 స్థానాల్లో సుమారు ఆరేడు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇదే క్రమంలో జనసేనకు కూడా బలమైన నేతలు ఉండడంతో వీటిపై మంతనాలు చేస్తున్నారు. వాస్తవంగా రెండో జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ప్రకటించాలని తొలుత భావించారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సీట్లను ప్రకటించేందుకు ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండో జాబితాలో తెలుగుదేశం 25 నుంచి 30 సీట్లు.. జనసేన 10 సీట్లు వరకూ ప్రకటించే అవకాశం ఉంది.

పొత్తులో సీట్లు దక్కనివారికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశాలపైనా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పొత్తుల కారణంగా సీట్ల సర్దుబాటు, మరి కొంతమంది ఆశావాహులను బుజ్జగించారు. ఇదిలా ఉంటే టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ పార్టీ కూటమిలో చేరితే సీట్ల సర్ధుబాటులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి.. ఏఏ నియోజకవర్గాలు ఆఫర్ చేయాలి అనే విషయాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కమలం పార్టీకి 10 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు పొత్తులపై చర్చించేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల జాతీయ నాయకుడు శివప్రకాశ్ రాష్ట్రానికి వచ్చి బీజేపీ నేతలతో పొత్తులపై చర్చలు జరిపారు. ఆ నివేదికను హైకమాండ్‌కు అందజేశారు. దీంతో పురందేశ్వరికి పిలుపు రావడంతో ఢిల్లీకి వెళ్లిన ఆమె పొత్తులపై నేతల అభిప్రాయాలు, సీట్ల సర్దుబాటు, పోటీకి సన్నద్దతపై పెద్దలతో చర్చించనున్నారు. ఆమెతో మాట్లాడిన తర్వాత రెండు రోజుల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు పిలుపు రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మార్చి 10వ తేదీ లోపు ఏపీలో టీడీపీ-జనసేనతో పొత్తులపై కమలం నేతలు తేల్చనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos