close
Choose your channels

తీగల వంతెనపై సరికొత్త ఆంక్షలు.. రాత్రి 11 దాటితే బంద్..

Saturday, October 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌‌కు దుర్గం చెరువుపై తీగల వంతెన మరో ఐకాన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ తీగల వంతెనపై సైబరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వంతెనను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిని నిరాకరించారు. అంతే కాకుండా తీగల వంతెనపై వాహనాల వేగం 35 కి.మీ మించకూడదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక తీగల వంతెన వద్ద పలువురు పుట్టినరోజు వేడుకలు, ఇతర వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిపై అధికారులు నిషేధం విధించారు.

వంతెనపై పుట్టిన రోజు, ఇతర వేడుకలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంతెనపై వాహనాలు నిలపడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు. అంతే కాకుండా వీకెండ్‌లో దుర్గం చెరువు నుంచి మాదాపూర్‌, రోడ్డు నం.45 వెళ్లే రోడ్లు మూసేస్తారు. పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. బ్రిడ్జికి రెండు వైపులా పరిమితమైన వాహనాల కోసం పార్కింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ, ఐటీసీ కోహినూర్‌ వెనుక వైపు, రోడ్డు నంబర్ 45 కేబుల్‌ బ్రిడ్జి కింద, మస్తాన్‌నగర్‌ కేబుల్‌ బ్రిడ్జి కింద, రోడ్డు నంబర్ 45 నుంచి పై వంతెనకు ఎడమ వైపు తాత్కాలిక పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు.

దుర్గం చెరువు బ్రిడ్జిని గచ్చిబౌలి, నార్సింగి, మియాపూర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి వైపు నుంచి వచ్చే వాహనాదారులు మైండ్‌ స్పేస్‌ రోటరీ మీదుగా వెళ్లాలి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలు రోడ్డు నం.45 మీదుగా దుర్గం వంతెన వద్దకు చేరుకోవాలి. బ్రిడ్జి వద్దకు వచ్చేవారు తమ వాహనాలకు కేటాయించిన స్థలాల్లోనే పా ర్కింగ్‌ చేసుకోవాలి.
బ్రిడ్జి పరిసరాల్లో సీసీటీవీల ద్వారా నిఘా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు తప్పనిసరి. భారీ వాహనాలైన ట్రాక్టర్స్‌, డీసీఎం, గూడ్స్‌ ఆటోలు, జేసీబీలు, క్రేన్‌, ట్రక్‌ ఇతరత్రా వాహనాలకు బ్రిడ్జిపైకి అనుమతి లేదు. వీటితో పాటు తోపుడుబండ్లు, ఎండ్ల బండ్లకు కూడా అనుమతి లేదు.

తీగల వంతెన కారణంగా మాదాపూర్‌ ప్రాంతానికి సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. చెరువుకు రెండు వైపులను కలిపేలా ఈ బ్రిడ్జిని చాలా అందంగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం మొత్తం రూ.184 కోట్లతో జరిగింది. సాయంత్రం అవగానే.. అద్భుతమైన లైటింగ్‌తో ఆ ప్రాంతానికే కొత్త వన్నె తీసుకువస్తోంది. దీంతో ఈ తీగల వంతెనను చూసేందుకు పర్యాటకులు విరివిగా వస్తున్నారు. దీంతో తీగల వంతెనకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా ఈ ఆంక్షలన్నింటినీ పాటించాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.