ఆపరేషన్ సక్సెస్.. బీజేపీలో చేరిన ఎంపీలు.. సుజనాకు మంత్రి పదవి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ‘కమలం’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావించిన బీజేపీ.. ముందుగా ఏపీ నుంచి ఆకర్ష్ ప్రారంభించి ఒకేసారి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పార్టీలోకి చేర్చుకుంది. గురువారం సాయంత్రం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్ కమలం కండువా కప్పుకున్నారు. దీంతో ఏపీలో బీజేపీ బలపడినట్లైంది. చేరిక అనంతరం జేపీ నడ్డా, సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నడ్డా ఏమన్నారంటే...
నలుగురు ఎంపీలకు బీజేపీ కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఏపీలో బలపడ్డామన్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల చీలికవర్గం బీజేపీలో విలీనం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్దతు తెలుపుతూ తీర్మానం లేఖలు ఇచ్చారు. అనంతరం నలుగురు టీడీపీ ఎంపీలకు కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. మోదీ నాయకత్వం నచ్చి, అమిత్షా పిలుపునకు స్పందించి సుజనా, సీఎం రమేష్, టీజీ, గరికపాటి బీజేపీలో చేరారని నడ్డా తెలిపారు. కాలిగాయం వల్ల గరికపాటి ఇక్కడికి రాలేకపోయారన్నారు. పాజిటివ్ రాజకీయాలపైనే బీజేపీకి విశ్వాసం ఉందని.. సబ్ కా సాత్, సబ్కా వికాస్ మా లక్ష్యమన్నారు. ఏపీలో బీజేపీ ఈ నలుగురి రాకతో బలోపేతమైందని.. ఏపీలో బీజేపీ పునాదులు పటిష్ఠమవుతాయని నడ్డా తెలిపారు.
సుజనా కీలక వ్యాఖ్యలు..
బీజేపీలో చేరిక అనంతరం ఎంపీ సుజనాచౌదరి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు నెరవేరాలంటే బీజేపీతో కలిసి పనిచేయాలన్నారు. కేంద్రంతో సంఘర్షిస్తే ఎలాంటి ఉపయోగం లేదన్నారు. దేశం ఎవరితో ఉందో ఎన్నికలతో తేలిపోయిందన్నారు. అందుకే మేం బీజేపీలో ఉండాలని నిర్ణయించుకున్నామని.. హక్కుల కోసం కేంద్రంపై పోరాటమంటూ టీడీపీ అనుసరించిన ధోరణిని ఈ సందర్భంగా సుజానా పరోక్షంగా గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. సుజనా మళ్లీ మోదీ కేబినెట్లో చోటు దక్కొచ్చంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. త్వరలోనే మరికొందరు రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో పాటు అసెంబ్లీలో 2/3 వంతు టీడీపీ సభ్యులు బీజేపీలోకి రాబోతున్నారని బీజేపీ కీలక నేత బాంబు పేల్చారు. లోక్సభలో టీడీపీ సభ్యులు కూడా మా దగ్గరికి రాబోతున్నారన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. మొత్తానికి చూస్తే తెలంగాణాలో టీడీపీకి ఏ పరిస్థితి అయితే వచ్చిందో.. ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.