close
Choose your channels

ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుంది.. సీసీ ఫుటేజీ బయటికి తీయండి!

Tuesday, April 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుంది.. సీసీ ఫుటేజీ బయటికి తీయండి!

"ఆంధ్రప్రదేశ్ బాగుండాలి.. మనం బాగుండాలనుకునే ఏ ఒక్కరూ వైసీపీకి ఓటేయరు. ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుంది" అని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పుకొచ్చారు. ఐదేళ్ల తర్వాత టీడీపీ ఆఫీసుకు వచ్చిన కోడెల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అసలేం జరిగింది..? తనపై ఎవరు దాడి చేశారు..? ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది..? అనే విషయాలపై నిశితంగా మాట్లాడారు.

టీడీపీకి వైసీపీ పోటీనా?

"కోడెల శివప్రసాద్‌కు అంబటి రాంబాబు పోటీనా?. టీడీపీకి వైసీపీ పోటీనా?. ఆశపడొచ్చు... దురాశ ఉండకూడదు. మీరేంటి... మీ చరిత్ర ఏంటి?. జనం ఓటేసి గెలిపించిన వాళ్లు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారు? ఓటేసినవారికి మీరెప్పుడైనా సమాధానం చెప్పారా? ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసా మీకు? భౌతికంగా దాడిపై వైసీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలి. భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని ఎత్తుగడలేసినా ఓటర్లు చెక్కు చెదరలేదు. ఆంధ్రా ఓటర్లకు జేజేలు పలుకుతున్నా. ఏపీలో చూడబోతున్నది టీడీపీ సునామీ" అని కోడెల జోస్యం చెప్పారు.

టీడీపీలో ఖాళీ లేదనే...

"జగన్‌ ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారో ఆంధ్రవాళ్లకు తెలుసు. ఆంధ్రవాళ్లు కుక్కలని తిట్టిన కేసీఆర్‌కు వత్తాసు పలుకుతారా?. ప్రధాని మోదీ కూడా స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేదు. కేంద్ర వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేసి చంద్రబాబును ఓడించాలని చూశారు. ఏపీకి ఏం కావాలో ఇక్కడి ప్రజలకు స్పష్టం కావాలి. పోలవరం కావాలి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. అవన్నీ కావాలంటే టీడీపీ కావాలని జనం ఓటేశారు. వైసీపీలోకి ఇప్పటికీ కొందరు నేతలున్నారంటే టీడీపీలో ఖాళీ లేదనే ఉన్నారు" అని కోడెల చెప్పుకొచ్చారు.

సీసీ ఫుటేజీ బయటికి తీయాలి..!

"పోలింగ్‌ బూతులో సీసీ టీవీ ఫుటేజీ బయటకు తీయాలి. ఎవరు తప్పు చేశారో తేలుతుంది. చట్టానికి కట్టుబడి పనిచేసే పార్టీ టీడీపీ. దుర్మార్గులను వదిలిపెట్టబోము, నిందితులకు శిక్షలు పడితీరతాయి. పోలింగ్‌ బూత్‌లో నాపై దాడి జరిగినప్పుడు భౌతికంగా కన్నా. మానసికంగా బాధపడ్డాను. అయినా ప్రజలకు తెలియాలనే అలాగే ఉన్నాను. బూత్‌ క్యాప్చరింగ్‌ చేశారు.. గర్భిణిలు కొట్టారు, హత్యలు చేశారు. ఎన్నికల్లో వైసీపీ చేయని అరాచకాలు లేవు. నాపై దాడికి సూత్రదారి అంబటి రాంబాబే. నాపై దాడి చేసి రాష్ట్రమంతా భయాందోళన సృష్టించాలనుకున్నారు. దాడి చేస్తే టీడీపీ భయపడతారు అప్పుడు ఇష్టమొచ్చినట్టు చేసుకోవచ్చనుకున్నారు. ఇది పూర్తిగా ప్లాన్‌ ప్రకారం చేసిన దాడే" అని కోడెల ఆరోపించారు.

విజయసాయిరెడ్డికి ఈసీలో పనేంటి?

"12గంటలకు కూడా చాలా చోట్ల పోలింగ్‌ ప్రారంభంకాలేదు. 40శాతం ఈవీఎంలు మొరాయించాయి బాధ్యులెవరు?. ఎన్నికల సంఘం రాజకీయాలకు వేదికగా మారింది. చీఫ్‌ సెక్రటరీని మార్చుతారని విజయసాయిరెడ్డి ప్రకటించాకే సీఎస్‌ను ఈసీ బదిలీ చేసింది. హరిప్రసాద్‌పై కేసులున్నాయి, ఈవీఎంలపై చర్చబోమని అంటున్నారు. మరి అన్ని కేసులున్న విజయసాయిరెడ్డికి ఈసీలో పనేంటి?. ఈవీఎంల లోపాలు హరిప్రసాద్‌ ప్రూవ్‌ చేస్తారని భయపడే ఈసీ అవకాశం ఇవ్వడంలేదు. ఢిల్లీ స్థాయి ఎన్నికల సంఘం ఎస్‌ఐలను మార్చుతుందా?. ఇది దుర్మార్గం కాదా?. సీబీఐ, ఈడీ, ఐటీ, రిజర్వ్‌బ్యాంక్‌ ఇప్పుడు ఈసీ వ్యవస్థలన్నింటీనీ మోదీ దుర్వినియోగం చేశారు. ఈసీ ప్రవర్తన చాలా తప్పు. ఈసీ ఓ పార్టీకి తొత్తుగా పనిచేసింది" అని కోడెల శివప్రసాద్‌ చెప్పుకొచ్చారు. కాగా కొడెల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.