బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకునేలా బీజేపీ అడుగులు వేస్తోంది. అటు దుబ్బాక.. ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇచ్చిన స్ఫూర్తితో వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో కొంతమేర అధికార పార్టీని రాష్ట్రంలో వీక్ చేసిన బీజేపీ.. ఇక రానున్న నాగార్జున సాగర్ ఎన్నికల్లోనూ చావు దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మీదట పార్టీని బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్నారు. కొంతమేర ఆయన సక్సెస్ అవుతున్నారనడంలో సందేహం లేదు. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చక్కగా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో నూతన చేరికలకు సైతం ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్, కాంగ్రెస్ మహిళా నేత విశాయశాంతి కమలం గూటికి చేరారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు.
బీజేపీ నేతలతో రహస్య సమావేశం!
తాజాగా నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ మళ్లీ ఇతర పార్టీల నేతలపై కన్నేసింది. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కమలం వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని నాగోల్లో ఓ రహస్య ప్రదేశంలో బీజేపీ ముఖ్య నేతలను ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి కలిసినట్లు సమాచారం. బీజేపీ కనుక తనకు నాగార్జునసాగర్ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే తక్షణమే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ ఓకే అయితే చిన్నపరెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.