వైఎస్ షర్మిళమ్మకు రాములమ్మ మద్దతు
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా వేదికగా తనపై, తనకుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. 'ఇది నా ఒక్క సమస్య అనుకోవట్లేదు.. మన మహిళా లోకానిదని అందరూ నాతో కలిసి రావాలి' అని పిలుపునిచ్చారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి షర్మిళకు మద్దతు వస్తోంది.
తాజాగా.. కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. షర్మిళకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. దుష్ప్రచారాలను చూస్తే.. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందని సాటి మహిళగా రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషం కక్కే ఈ విష సంస్కృతిని తక్షణమే నియంత్రించి.. ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇంకెన్నాళ్లిలా..!
అసలే రాజకీయాల్లో మహిళను అణగదొక్కుతూ, వారిని వేధిస్తూ పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ తరహా ఘటనలు మహిళలను మరిత మానసికంగా కుంగదీస్తాయన్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడం కోసం.. పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. అయితే మహిళా లోకం నుంచి ఏ మేరకు మద్దతు వస్తుందో చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.