close
Choose your channels

జాలి చూపించండన్న జనసేన ఎమ్మెల్యే.. పడిపడి నవ్విన జగన్!

Tuesday, June 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జాలి చూపించండన్న జనసేన ఎమ్మెల్యే.. పడిపడి నవ్విన జగన్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున హాట్‌, హాట్‌గా ముగిశాయి. మంగళవారం నాడు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే ఈ క్రమంలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సభలో నవ్వులు పూయించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన వరప్రసాద్.. ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపించారు. అంతటితో ఆగని ఆయన.. వైసీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మిత్రపక్షం అయిన బీజేపీని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించాలని రాపాక కాసింత వివాదానికి తెరలేపారు.

శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్..

రాపాక వ్యాఖ్యలకే వెంటనే స్పందించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "బీజేపీ మాకు మిత్రక్షం కాదు.. మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు.. మేం బీజేపీతో కలిసి పోటీ చేయాలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల్లో జనసేన టీడీపీతో అంతర్గత పొత్తు పెట్టుకుందని.. పైకి రెండు పార్టీలు విడి,విడిగా పోటీ చేసినా.. బీఫామ్‌లు మాత్రం ఇష్టం వచ్చినట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లిన సమయంలో.. ప్రధాని మోదీ తిరుమల వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు" అని రాపాకకు ఒకింత శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

రాపాక రియాక్షన్ ఇదీ..

శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాపాక.. వైసీపీ- బీజేపీకి మిత్రపక్షమని వ్యాఖ్యానించడం తప్పేనన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి హోదా సాధించాలని కోరుతున్నానని ఆయన తప్పు మాట్లాడని తెలుసుకున్నారు. చెప్పుకొచ్చారు. "ఏపీకి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందన్నది నా ఆశ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. జగన్ పట్టుదల కలిగిన వ్యక్తి.. మాట తిప్పరు, మడం తిప్పరు అని నమ్మకం ఉంది.. మాట ఇస్తే వెనక్కు తీసుకోరు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేయాలని.. అమలు చేస్తే జనసేన కూడా మద్దతుగా ఉంటుంది" అని రాపాక చెప్పుకొచ్చారు.

జాలి చూపండి అధ్యక్షా!

ఒకానొక క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. రాపాకపై మాటల యుద్ధం చేయడంతో అధ్యక్షా.. మీరు, వైఎస్ జగన్ గారు కాస్త జాలి చూపించాలని కోరగా.. సీఎం ఈ మాటలకు పడిపడి నవ్వారు. దీంతో సభలో నవ్వుల వర్షం కురిసింది. కాగా.. టీడీపీ నేతల కంటే మంచి సబ్జక్ట్‌తో రాపాక మాట్లాడుతున్నారని.. మొదటి రోజునుంచి ఆయన మంచిగా మాట్లాడుతూ జనసేన గళం వినిపిస్తున్నారని.. ఉన్నది ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ పరువు నిలబెడుతున్నారని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలేం జరుగుతోంది..!?

కాగా.. జ‌న‌సేన నుండి గెలిచిన రాపాక వ‌రప్రసాద్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున వైఎస్ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటికే అందరూ ఆయన జంప్ అయిపోతారని పెద్ద ఎత్తున పుకార్లు పుట్టించేశారు. అయితే రాపాక మాత్రం తాను జ‌న‌సేన‌లోనే ఉంటాన‌ని.. తాను జ‌న‌సేన‌లో ఉంటే తాను ఫ‌స్ట్ అని..అదే వైసీపీలోకి వెళ్తే 152 నెంబ‌ర్ అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా.. జ‌న‌సేన ఎమ్మెల్యే స‌భ‌లో మాట్లాడుతూ త‌న పైన సానుభూతి చూపించాల‌ని వ్యాఖ్యానించ‌టం.. పార్టీ వాయిస్ అనుకున్నంతగా వినిపించ‌లేక పోయార‌నే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపైన జ‌నసేన, రాపాక ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.