మే-30న సీఎంగా జగన్ ప్రమాణం.. మొదటి సంతకం..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని స్థానాలు దక్కించుకున్న వైసీపీ మరో వారం రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ మొట్ట మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ తేదీన, ఎక్కడ జరుగుతుందన్న విషయాలపై స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కనివీనీ ఎరుగని చరిత్ర..!
"ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇంత గొప్ప విజయం ఇంత వరకూ నమోదు కాలేదేమో. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందించిన ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మరోసారి నా మీద ఈ విశ్వాసం ఉంచినందుకు పేరు పేరునా ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ప్రజల విశ్వాసం నాపై బాధ్యతను ఇంకా పెంచింది.
గవర్నెన్స్ అంటే ఏమిటీ.. గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేలా నా ప్రతి అడుగు వేస్తాను. ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మా పార్టీకే రావడం.. 153 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా వైసీపీ ఆధిక్యంలో ఉండటం ఏపీ చరిత్రలో ఇదో నూతన అధ్యాయం. మా పార్టీకి అద్భుత మెజార్టీ అందించిన ప్రజలకు జగన్ కృతఙ్ఞతలు. ఈ నెల 30న ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. ని స్పష్టం చేశారు. ఆరు నెలల నుండి సంవత్సరంలోపు జగన్ మంచి సీఎం అనిపించుకుంటాను" అని జగన్ స్పష్టం చేశారు.
దేవుడి దయతో..!
"ఈ విజయం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైంది. మీ అందరి ఎదుటకు వచ్చి నిల్చొని మాట్లాడగలుతానంటే నిజంగా అది నా అదృష్టం, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలని గర్వంగా చెబుతాను. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచింది. విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారు. విశ్వసనీయత లేని నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు చూపించారు. నాపై ఉన్న విశ్వాసంతో ఓటు వేశారు. ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా.. 5 కోట్ల మంది ప్రజానీకంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే అవకాశం దేవుడు ఒక్కరికే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం దేవుడి దయ, ప్రజల దీవెనలతో వచ్చింది" అని జగన్ చెప్పుకొచ్చారు.
సీఎంగా మొదటి సంతకం..
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేనిపై చేస్తారన్న ప్రశ్నకు కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "‘నవరత్నాలు’ను నేను గట్టిగా నమ్ముతున్నాను. 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశాను.. ప్రజలు చెప్పిన బాధలను విన్నాను. ప్రతిఒక్కరికి నేను హామీ ఇస్తున్నా. ‘నేను చూశా.. నేను విన్నా.. నేను ఉన్నా’ అని ఈరోజున ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా. ఒక్క సంతకం కాదు.. ‘నవరత్నాలు’ను తీసుకొచ్చే పాలన ఇవ్వబోతున్నానని కచ్చితంగా చెబుతున్నా’" అని జగన్ స్పష్టంచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.