close
Choose your channels

ఆక్సిజన్ కొరతతో 20 మంది మృతి.. ప్రమాదంలో 200 ప్రాణాలు..

Saturday, April 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశమంతటా కోవిడ్ విలయ తాండవం చేస్తోంది. ఎలాగోలా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆసుపత్రుల్లో చేరితే ఏదో ఒక కారణంగా ఆసుపత్రుల్లో ప్రాణాలు పోతున్నాయి. మొన్న మహారాష్ట్రలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై.. రోగులకు ఆక్సిజన్ అందించడం అర్థగంట పాటు ఆలస్యమవడంతో 22 మంది రోగులు మృతి చెందారు. ఇక అదే మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ అవడంతో 14 మంది రోగులు సజీవ దహనమయ్యారు. ఇక నేడు ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

మరో అర గంటకు మాత్రమే సరిపోయే ఆక్సిజన్ నిల్వులున్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఆందోళన నెలకొంది. లెక్క ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా అందాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12 గంటలకు ఆక్సిజన్ అందింది. దీనిపై ఆస్పత్రి వర్గాలు మాట్లాడుతూ.... మరణించిన 20 మంది రోగులూ ఆక్సిజన్‌ సపోర్ట్‌తో ఉన్నారన్నారు. ఆక్సిజన్ సరిపడా లేని కారణంగా తాము ఆక్సిజన్ సరఫరా ఫ్లోను తగ్గించామన్నారు. అందరూ ఆక్సిజన్ అందక మరణించారని తాము చెప్పడం లేదని.. కానీ అది కూడా ఒక కారణమేనన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో 22 మంది కరోనా రోగులు మరణించారు.

మరోవైపు పంజాబ్‌లోనూ ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు. అమృత్‌సర్‌లోని నీలకాంత్ ప్రైవేట్ హాస్పటల్‌లో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. 48 గంటలుగా ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నామని నీలకాంత్ హాస్పటల్ ఎండీ చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొని ఉంది. ఈ సమస్య కారణంగా ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఆక్సిజన్ అందించే ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించక పోగా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.