close
Choose your channels

Gutha Amit:బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా కుమారుడు అమిత్

Monday, April 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నేతలు గులాబీ పార్టీకి బై చెప్పగా.. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీప్‌దాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయన మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు నల్గొండకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ గుత్తా ఫ్యామిలీ.. కనీసం లోక్‌సభ ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన గుత్తా సుఖేందర్‌ కుమారుడు అమిత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నేరుగా కేసీఆర్‌కు చెప్పేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇటీవల గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల అహంకారంతోనే అధికారంతో పాటు ప్రజలకు దూరమైందని గుత్తా కొద్దిరోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్.. నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం మానేశారని విమర్శించారు. బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారైందంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో గుత్తా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అప్పటి నుంచి గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్‌ పార్టీలో చేరనుందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్‌ పెడుతూ తాజాగా గుత్తా కుమారుడు అమిత్.. హస్తం కండువా కప్పుకున్నారు. త్వరలోనే గుత్తా సుఖేందర్ కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.