close
Choose your channels

పీవీఆర్ సినిమాస్‌లో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షప్రసారం

Saturday, January 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పీవీఆర్ సినిమాస్‌లో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షప్రసారం

యావత్ ప్రపంచంలోని హిందూవులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అద్భుతమైన క్షణంకు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ట జరగనుంది. జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12.20- 1.00 గంటల మధ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు రానున్నారు.

ఇప్పటికే రామభక్తులు రైళ్లు, బస్సులు, విమానాలు, సొంత వాహనాల ద్వారా అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ శుభవార్త అందించింది. తమ మల్టీఫ్లెక్స్‌ల్లోని వెండి తెరపై రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలను ప్రత్యక్షప్రసారం చేస్తామని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాములోరి పండగను లైవ్‌లో చూపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి.

పీవీఆర్ సినిమాస్‌లో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షప్రసారం

సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్‌ స్క్రీన్‌పై ఈ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించవచ్చు. ఇందుకు సంబంధించిన టికెట్లు పీవీఆర్, ఐనాక్స్ అధికారిక వెబ్‌ సైట్లతో పాటు మూవీ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్ అయినా బుక్‌ మై షో, పేటీఎంలల్లో బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి టిక్కెట్‌పై కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మరి ఇంకెందుకు ఆలస్యం బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం పెద్ద తెరపై చూసి తన్మయం చెందేందుకు టికెట్లు బుక్ చేసుకోండి.

కాగా రామమందిరంలో ప్రతిష్టించే బాలరాముడి ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహం చూసిన భక్తులు తన్మయంలో మునిగిపోతున్నారు. ఆలయ నిర్వాహకులు ప్రాణ ప్రతిష్ఠకు ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఆ బాలరాముడిని చూస్తుంటే సాక్షాత్తూ చిన్నప్పటి రాములోరే స్వయంగా వచ్చినట్లు ఉంది. అంత అందంగా విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాన్ని కృష్ణ శిలతో కర్ణాటకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 5 అడుగుల పొడవైన బాల రాముడి విగ్రహం బరువు 150 కేజీలు ఉంది. నల్లని పద్మపీఠంపై ఐదేళ్ల బాలుడి రూపంలో ఆ రామయ్య కొలువుదీరారు. ముఖంపై చిరుదరహాసంతో నుదిటన మూడు నామాలతో సుందర రూపంలో వెలిగిపోతున్నారు. బంగారు విల్లు, బాణం చేత పట్టుకుని రోమాలు నిక్కబొడిచే ఠీవితో నిల్చుని ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.