close
Choose your channels

ఈ నెల 21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే

Thursday, January 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ నెల 21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే

ఏపీలో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ బై.. బై చెప్పనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన పార్టీ మారతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటీవలే అవన్నీ పుకార్లేనని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం జరిగిన రెండ్రోజుల గ్యాప్‌‌లోనే ఆకుల యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నట్లు ఆకుల తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు ఓటు వేయాలని ప్రజలను అడగలేని పరిస్థితులండటంతో ఆకుల పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరాలని నిర్ణయించారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఆకుల సతీమణి లక్ష్మీ పద్మావతి జనసేనలో కొనసాగుతున్నారు.

పవన్ ఎక్కడుంటే అక్కడే..!
ఈ నెల 21న జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఆకుల స్పష్టం చేశారు. ఆ రోజు పవన్ ఎక్కడుంటే అక్కడికే వెళ్లి ఆయన సమక్షంలోనే జనసేన కండువా కప్పుకోవడానికి ఆకుల సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు స్థానికంగా ఉన్న నేతలు, భారీగా అనుచరులు బీజేపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా బీజేపీలో అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు నేతలు సైతం అదేరోజు జనసేనలో చేరే అవకాశాలున్నాయి. అయితే ఎమ్మెల్యే ఆకుల బీజేపీకి టాటా చెప్పడంతో ఏపీలో అంతంతమాత్రమే ఉన్న పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే మున్ముంథు పార్టీలో ఎంతమంది కొనసాగుతారనేదానిపై అధిష్టానానికి టెన్షన్ పట్టుకుంది.

టికెట్ హామీ వచ్చినట్లేనా..!
ఆకుల జనసేనలో చేరితే పరిస్థితేంటి..? ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? పవన్ ఆయనకు సీటిస్తారా..? లేదా అనే విషయాలపై ఆరా తీయగా.. రాజమండ్రి లోక్‌సభ నుంచి ఆకుల పోటీ చేసే అవకాశముంది. రియల్‌‌ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ 2013లో రాజకీయ అరగేట్రం చేసిన ఆకుల.. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కొన్ని పరిణామాల వల్ల ఆయనకు టీడీపీ-బీజేపీ పొత్తుతో రాజమండ్రి అర్బన్ టికెట్‌‌తో ఇవ్వడం జరిగింది. జనసేనలో చేరితే ఎంపీగా పోటీ చేయాలనుకున్న ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ఆయన సతీమణి రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ టికెట్ల వ్యవహారంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ నెల 26న జనసేన విడుదల చేయనున్న తొలి జాబితాలో ఆకుల, ఆయన సతీమణి పేరుంటుందో.. ఉండదో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.