close
Choose your channels

బడ్జెట్‌-2020తో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేంటి!?

Saturday, February 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బడ్జెట్‌-2020తో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేంటి!?

కేంద్ర బడ్జెట్-2020లో తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిందేమీ లేదు. స్మార్ట్ సిటిలు, రైల్వే లైన్ల సంఖ్య మాత్రమే చెప్పగా వాటిలో తెలుగు రాష్ట్రాలకు కూడా ఉంటాయని అనుకుంటున్నారే తప్ప.. అంతకుమించి ఒరిగిందేమీ లేదు. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం వరాల వర్షం కురిపించింది. కర్ణాటక రాష్ట్రానికి కేవలం రోడ్లు నిర్మాణానికి కొన్నివేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండిచేయి చూపడంతో ఎంపీలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించి.. కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హోదా, పోలవరం నిధులు ఇలాంటివెన్నే ఆశించినప్పటికీ కేంద్రం ఇచ్చిందేమీ లేదని చెప్పుకొచ్చారు.

ఏమేం ఆశించారు!?

ప్రసంగం మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల ఊసేలేదు. కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు మంజూరు చేయకపోవడం గమనార్హం. అంతేకాదు.. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వే లైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు లేకపోవడం, మరీ ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్ ఊసే లేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేంద్రం కేటాయించలేదు.

తెలంగాణ ఏం ఆశించింది!?

పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప తెలంగాణకు పైసా కూడా కేంద్రం ఇచ్చిందిలేదు. మరీ ముఖ్యంగా విభజన నాటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదు.. ఈ బడ్జెట్‌లో అయినా కేటాయింపులు ఉంటాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆశలన్నీ అడియాసలయ్యాయి. ప్రాజెక్టులకు పైసా కూడా కేటాయించలేదు. పార్లమెంట్, మునిసిపల్ ఎన్నికల్లో కమలం వికసించిన నిజామాబాద్‌కు కూడా పసుపుబోర్డు ప్రకటన రాలేదు.

కేంద్ర మంత్రి హామీ..!

అయితే.. ఏపీకి న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రస్తావించిన ఆయన.. రాష్ట్రానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు ఏమిచ్చారు..? ఏపీకి ఏమిచ్చారు..? అనే ప్రశ్న ఎదురువ్వగా.. ఆంధ్రప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లు రెండూ వేర్వేరు అంశాలు అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను యూటీగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా.. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే బీమాను రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్ లో ప్రతిపాదించడం సామాన్యులకు ఇచ్చిన బహుమతిగా ఆయన చెప్పుకొచ్చారు.

జమ్ముకు ఏమిచ్చారంటే..!

కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాక్‌లకు ఈ బడ్జెట్‌లో భారీగా ప్యాకేజీలు కేటాయించడం జరిగింది. 2020-21 సార్వత్రిక బడ్జెట్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, లద్దాక్‌కు రూ.5,958 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు.

మొత్తానికి చూస్తే.. అయినవాళ్లకు ఆకుల్లో.. కాని వాళ్ళకు కంచాల్లో అన్న చందంగా కేంద్రం వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాలకు ఏమేం వస్తాయో..? ఏమేం కేటాయింపులు ఉన్నాయోత తెలియాలంటే పూర్తి ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.