close
Choose your channels

Election:దేశంలో మొదలైన ఎన్నికల సందడి.. తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల..

Wednesday, March 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తొలివిడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 28న నామినేషన్ల పరిశీలన.. 30 వరకు ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఇక ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

తొలివిడతలో భాగంగా తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్రలో 5, ఉత్తరాఖండ్‌లో 5, అసోంలో 5, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, మణిపుర్‌లో 2, మేఘాలయలలో 2 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

మార్చి 16న లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం 44 రోజులపాటు పోలింగ్‌ జరగబోతోంది. 1951-52లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం విశేషం. ఇక ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు కూడా అదే తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న అన్ని విడదల పోలింగ్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.