close
Choose your channels

Etala, Revanth:గజ్వేల్‌లో ఈటల.. కామారెడ్డిలో రేవంత్.. కేసీఆర్‌పై పోటీకి సై..!

Thursday, October 26, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా విపక్షాలు పోరాటం చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌పై పోటీకి కీలక నేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తొలిసారిగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. తన కంచుకోట గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగారు. దీనిపై ప్రతిపక్షాలు సెటైర్లు కూడా వేశాయి. గజ్వేల్‌లో భయంతోనే కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగారని విమర్శలు చేశాయి.

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గులాబీ బాస్‌పై పోటీకి కాలుదువ్వారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్, ఈటల కలిసి పనిచేశారు. అయితే 2021లో ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్‌పై ఈటల తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీసీల్లో ఈటలకు మంచి గుర్తింపు ఉంది. దీంతో కేసీఆర్‌పై ఈటల పోటీకి నిలపాలని భావించిన కమలం పెద్దలు ఆయన పేరును ప్రకటించారు. దాంతో గజ్వేల్‌లో ఈసారి ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది.

ఇక కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించాలనే పట్టుదలంతో కాంగ్రెస్ ఉంది. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి పెట్టాలని యోచిస్తోంది. ఇందుకు రేవంత్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తనను జైలులో పెట్టడంతో కేసీఆర్‌పై రేవంత్ ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పోరాడుతున్నారు. అవకాశం వస్తే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్‌ను గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నారు.

తెలంగాణలో కేసీఆర్ తర్వాత బలమైన ప్రజాభిమానం ఉన్న నేతలుగా ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిలకు పేరుంది. ప్రజల్లో కూడా వారికి మాస్ లీడర్లుగా మంచి క్రేజ్ ఉంది. దీంతో ఇద్దరు నేతలు కేసీఆర్‌పై పోటీకి దిగనుండడంతో ఈసారి ఎన్నికల పోరు యుద్ధాన్ని తలపించనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.