DK Shivakumar:హెలికాఫ్టర్ను ఢీకొన్న పక్షి.. డీకే శివకుమార్కు తప్పిన పెను ప్రమాదం, ప్రజల ఆశీర్వాదం వల్లేనన్న కేపీసీసీ చీఫ్
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్లు చాపర్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున డీకే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కువగా హెలికాఫ్టర్ను వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ప్రచారం కోసం ముళ్బాగల్ అనే ప్రాంతానికి వెళ్తుండగా శివకుమార్ హెలికాఫ్టర్ను పక్షి ఢీకొట్టింది. ఆ వెంటనే హెలికాఫ్టర్ ముందు భాగంలో వున్న గ్లాస్ పగిలిపోయింది. అయితే పైలట్లు అత్యంత చాకచక్యంతో హెలికాఫ్టర్ను హెఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు . ఈ ఘటనలో పైలట్కు , డీకేతో పాటు ప్రయాణిస్తున్న పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డీకే శివకుమార్ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజల ఆశీర్వాదం వల్లే బయటపడ్డానన్న డీకే :
మరోవైపు.. ఈ ప్రమాదంపై డీకే శివకుమార్ స్పందించారు. కన్నడ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను బయటపడినట్లు పేర్కొన్నారు. తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణీకుడికి, పైలట్కు గాయాలు అయ్యాయని శివకుమార్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పైలట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తాము రోడ్డు మార్గం ద్వారా ప్రచారానికి వెళ్లినట్లు తెలిపారు.
మే 10న కర్ణాటక ఎన్నికలు :
కాగా.. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఏప్రిల్ 20.. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 24గా నిర్ణయించారు. ఈ క్రమంలో కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.