close
Choose your channels

CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కీరవాణి, అందెశ్రీ భేటీ.. ఎందుకంటే..?

Tuesday, May 21, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీ సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వీరితో చర్చించారు. త్వరలోనే కీరవాణి, అందెశ్రీ ఆధ్వర్యంలో మరింత నూతనంగా ఈ పాట రూపుదిద్దుకోబోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ఉన్న ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే పాటను ప్రజాకవి అందెశ్రీ రచించారు. ఈ పాట రాష్ట్రవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా ఈ పాటను ఆలపిస్తున్నారు. కాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని మార్పులు చేసిన విషయం విధితమే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌ పేరును అధికారికంగా వాడేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్‌ పార్టీకి దగ్గరగా ఉంటుందని టీఎస్ పేరు గతంలో చేర్చారని సీఎం ఆరోపించారు. అందుకే అందరికి వాడుక భాషలో ఉండేలా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గ తీర్మానం పంపించింది. దీంతో ఇటీవలే కేంద్రం టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని అధికారులు తక్షణమే రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్‌ను టీఎస్‌ బదులుగా టీజీని వాడాలని స్పష్టం చేసింది. లెటర్‌ హెడ్స్‌ రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్‌ సైట్లు, ఆన్‌లైన్‌ జీవోలు ఇతర అధికారిక వెబ్‌ సైట్లు ఆన్‌లైన్‌ జీవోల్లో టీజీగా మార్చాలని వెల్లడించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.