close
Choose your channels

కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్.. 3 నెలల క్రితమే ప్లాన్..

Saturday, October 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహం ముసుగులో యువతిని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను కూకట్‌పల్లి ఏసీపీ బి.సురేందర్‌రావు, లక్ష్మీనారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు బోరబండకు చెందిన జోసెఫ్(20), బొందగడ్ల నవీన్‌రెడ్డి(22), రాగని రాము(23)లను అరెస్ట్ చేసినట్టు మీడియాకు వెల్లడించారు. అత్యాచార కుట్రను ఈ ముగ్గురూ మూడు నెలల క్రితమే రూపొందించారని పోలీసులు వెల్లడించారు.

అత్యాచార సమయంలో నిందితులు వీడియోలు కానీ.. ఫోటోలు కానీ తీసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బోరబండకు చెందిన యువతిని ఈ నెల 5న తన పుట్టిన రోజని చెప్పి రప్పించారని.. ఆ తరువాత నలుగురూ కలిసి రోజంతా పలు ప్రాంతాల్లో తిరిగి మధ్యాహ్నం హోటల్ గదికి తీసుకెళ్లారు. పుట్టినరోజు కేకులో మత్తుమందు కలిపి యువతికి తినిపించారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి ఆమెను ఇంటికి పంపించేశారు.

ఈ నెల 11న బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.