close
Choose your channels

'వైన్ షాపులు తెరవండి.. ఆల్కహాల్‌ తాగితే కరోనా పోతుంది!’

Friday, May 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైన్ షాపులు తెరవండి.. ఆల్కహాల్‌ తాగితే కరోనా పోతుంది!’

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు విరుగుడు ఏంటో ఇప్పటికీ తెలియట్లేదు.. ఎప్పుడు వ్యాక్సిన్ కనుగొంటారో కూడా తెలియట్లేదు. అయితే నేతలు మాత్రం ఇదిగో అదుగో.. ఇలా చేయండి.. అలా చేయండి అని చెప్పి ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసి ఇదిగో ఇలా చేస్తే వైరస్‌ను మట్టుబెట్టొచ్చు.. ఈ సలహా పాటించండి అని చెబుతున్నారు. సంగోడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ ఈ హడావుడి చేశారు.

మద్యం షాపులు తెరవండి..

‘రాష్ట్రంలో మద్యం షాపులు తెరవండి. ఆల్కహాల్‌తో చేతులు కడిగినప్పుడు కరోనావైరస్ పోతుంది. అంతేకాదు అదే మద్యం తాగినప్పుడు గొంతు నుంచి కూడా వైరస్ పోతుంది. దయచేసి మద్యం షాపులు తెరవండి’ అని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ సంస్థ ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మద్యం లభించడం లేదని.. తద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. ఒరిజనల్ మందు దొరక్క.. నకిలీ మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోయారని అందుకే మద్యం షాపులు తెరవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లిక్కర్ ద్వారా 12 వేల కోట్ల ఆదాయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పుడు లిక్కర్ అమ్మకాలు ఆగిపోవడం వల్ల ఆ ఆదాయం వచ్చేలా కనిపించడం లేదని వెల్లడించారు.

కేసుల సంఖ్య ఇదీ..

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,993 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 35,043కు పెరిగాయి. ఈ విషయాన్ని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 25,007 కేసులు కొనసాగుతున్నాయని.. 8,888 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న ఒక రోగి వేరే దేశానికి వెళ్లిపోయారు. దేశంలో వైరస్ వల్ల గడచిన 24 గంటల్లో మరో 73 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,147కు పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 10,498 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 459గా ఉంది. రెండో స్థానంలోని గుజరాత్‌లో 4,395 కేసులు ఉంటే.. 214 మంది చనిపోయారు. న్యూ ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,515 కాగా, ఇప్పటివరకూ 59 మంది వైరస్‌కు బలయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.