జోగయ్య త్వరగా కోలుకోవాలి.. నాకు మార్గదర్శకులు కావాలి!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ హితం కోరుకొనే చేగొండి హరిరామ జోగయ్య త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. తనకు, పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరితే వారు అందుకు అంగీకారం తెలిపారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాడు పవన్ కల్యాణ్.. హరిరామ జోగయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నిబద్ధత కలిగిన హరిరామ జోగయ్య నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా 2004-09 కాలంలో ఉండి.. మా కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారన్నారు. అనుభవజ్ఞులైన వారి సలహాలు, ఆశీస్సులు అవసరమని పోరాటయాత్ర సమయంలో పాలకొల్లు వెళ్ళి కలిశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయం గురించి చర్చించారు. హరిరామ జోగయ్యగారు నాకు మార్గరదర్శకులుగా ఉంటారు"అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారు కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. పవన్ కల్యాణ్ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ... అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి పవన్ కల్యాణ్ గారు వస్తారు’ అని చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.