‘అమ్మఒడి’ పథకంపై క్లారిటీ.. జగన్ సర్కార్ కీలక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల్లో ‘అమ్మఒడి’ పథకం ఒకటి. వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రధానమైనవి నవరత్నాలు మాత్రమే. వాటిలో కూడా కొన్నింటిని జగన్ చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. ముఖ్యంగా అమ్మఒడి అంటూ జగన్ ఈ కీలక ప్రకటనతో చాలా వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావితం అయ్యారు. దీంతో వైసీపీకి గట్టిగానే ఓట్లొచ్చిపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో వైఎస్ పదే పదే ఈ అమ్మఒడి పథకం గురించి చెబుతూ.. మీ పిల్లలను బడికి పంపితే చాలు రూ. 15వేలు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ముందుగా చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం అనంతరం పలు సమావేశాల్లో ఈ నవరత్నాల గురించే ఎక్కువగా చర్చించారు.
ఏ స్కూల్ అయినా ఓకే..!
అయితే ఈ ‘అమ్మఒడి’ పథకంపై ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమేనా.. లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందా..? అనేదానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ సందేహాలు, అపోహలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా.. అది ప్రభుత్వం లేదా ప్రైవేట్ అని లేకుండా అందరికీ అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఏపీ సీఎంవో కార్యాలయం క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే చర్యలు ప్రారంభం కాబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది.
రాష్ర్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడం, అక్షరాస్యతా శాతం పెంచడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొంది. దేశంలో నిరక్షరాస్యత సగటు 26 ఉంటే, ఏపీలో మాత్రం 33 శాతం ఉందని, ప్రతిఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ‘అమ్మఒడి’ తీసుకొస్తున్నట్టు తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.