close
Choose your channels

కేసీఆర్‌తో జగన్ భేటీ.. గంటపాటు ఏం చర్చించినట్లు!?

Saturday, May 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్‌తో జగన్ భేటీ.. గంటపాటు ఏం చర్చించినట్లు!?

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా ఇరువురూ పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈనెల 30న విజయవాడలో జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు. కాగా.. శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో జగన్ భేటీ అయ్యారు. వైసీపీ శాసనసభాపక్ష సమావేశ తీర్మానాన్ని గవర్నర్‌కు ఆయన అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌ను జగన్‌ కోరడం జరిగింది. భేటీ అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన వైఎస్ జగన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు.. జగన్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు.

గంటపాటు చర్చ...
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు.

లివ్ అండ్ లెట్ లివ్!
"ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాము. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ – మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పాను. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం" అని జగన్‌కు కేసీఆర్ నిశితంగా వివరించారు.

ఏపీ వాడుకునే వీలుంది..
"గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు" అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.

జగన్‌కు ఘన స్వాగతం..!
ప్రగతి భవన్‌కు వచ్చిన జగన్‌ను కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు. పోచంపల్లి ఇక్కత్ శాలువాకప్పి సన్మానించారు. కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపిక బహుకరించారు. సీఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని జగన్‌ను దీవించారు. స్వీటు తినిపించి సంతోషం పంచుకున్నారు. రాష్ట్ర మంత్రులను, ఇతర ప్రముఖులను జగన్‌కు పరిచయం చేశారు. జగన్ భార్యకు కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ సతీమణి శైలిమ స్వాగతం పలికారు.

జగన్ వెంట ఆంధ్రప్రదేశ్ ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ తో పాటు జగన్ కు స్వాగతం తెలిపిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటెల రాజెందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు, ఎంపి జె. సంతోష్ కుమార్, మాజీ ఎంపిలు బి.వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.